
జనం మెల్లిగా థియోటర్స్ కు వస్తూండటం సినిమా నిర్మాతలకు ఊరట ఇస్తోంది. ఓటీటిలలో రిలీజ్ చేయటం తప్ప వేరే దారి లేదని భావిస్తున్న ప్రొడ్యూసర్స్ థియోటర్ రిలీజ్ లకు డేట్స్ ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో రిలీజ్ కు ముస్తాబు అవుతున్న మరో పెద్ద సినిమా ఆచార్య. గత కొద్ది రోజులుగా రిలీజ్ విషయమై ఆచార్య టీమ్ నుంచి ఎలాంటి మాటలు లేకపోవడం మెగా ఫ్యాన్స్ ని అయోమయంలో పడేస్తోంది. మొదట ఆగస్టులో ఈ సినిమా వస్తుందనుకున్నారు. ఆ తరవాత అక్టోబరు అన్నారు. అవేమీ కాదు సంక్రాంతి అంటున్నారు. అబ్బే సంక్రాంతికి థియోటర్స్ ఖాళీ ఎక్కడున్నాయి. అప్పుడూ ఈ సినిమా డౌటే అంటున్నారు.
దాంతో ఆచార్య రిలీజ్ ఏమిటన్నది తెలియటం లేదు. అయితే దర్శక,నిర్మాతలు ఇప్పటికే ఈ విషయమై ఇప్పటికే క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలానా రోజు రిలీజ్ అని ఫిక్స్ అయ్యిపోయారు. కానీ ప్రకటించలేకపోతున్నారు. పోస్ట్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. అందుకు కారణం చిరంజీవి వివరించారు. నిన్న రాత్రి “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ...రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దయచేసికనికరించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య’ సినిమా ఇంకా ఎందుకు విడుదల కాలేదు అనే విషయాన్ని వెల్లడించారు. “సినిమాలు పూరయ్యి కూడా విడుదల చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాము. ‘ఆచార్య’ విషయానికొస్తే… సినిమా పూరైయిపోయింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి ? ఎలా రిలీజ్ చేయాలి ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం టార్గెట్ ను రీచ్ అవ్వగలమా ? రిలీజ్ చేస్తే రెవెన్యూ వస్తుందా రాదా? ఇప్పుడిప్పుడే జనం థియేటర్లకు వస్తారా అనే భయం పోయి నెమ్మదిగా ధైర్యం వస్తోంది.
ఇలాంటి యంగ్ స్టర్స్ ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తే జనాలు చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అయితే సినిమా విడుదలయ్యాక రెవెన్యూ వస్తుందా ? అనేది మాత్రం మనము ఆలోచించాలి. ఆ ధైర్యం, వెసులుబాటు ప్రభుత్వాలు మనకు ఇవ్వాలి. మా కోరికను మీకు విన్నవించాము. దానికి సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో టిక్కెట్టు ధర లేనందుకే “ఆచార్య” రిలీజ్ కు వెనకడుగు వేస్తున్నాడని స్పష్టం అయ్యింది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దీపావళి రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రటీమ్ సన్నాహాలు చేసుకుంటోంది.దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీన ‘ఆచార్య’ను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటి వరకూ దీనిని అధికారికంగా ప్రకటించ లేదు. రెండు పాటలు మినహా ‘ఆచార్య’ మొత్తం పూర్తయింది. ఈ రెండు పాటలను కూడా వీలయినంత త్వరగా పూర్తి చేసి దీపావళి విడదలకు సన్నద్ధం అవుతున్నారట. నవంబర్ నెల దాటితే,.. సంక్రాంతి వరకూ ఆచార్యకు రిలీజ్ డేట్ దొరకదు. సంక్రాంతికి పవన్ సినిమా బరిలో ఉంది. పవన్ తో పోటీ పడడం చిరుకి ఇష్టం లేదు. కాబట్టి.. అక్టోబరులోనే ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్సయిపోయారు. త్వరలోనే ఈ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఆచార్య’చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. నిర్మాతలు నాన్-థియేట్రికల్ రెవెన్యూ కింద పెద్ద మొత్తంలో అందుకోబోతున్నారు కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్. అయితే, కొరటాల శివ టేకింగ్, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ కథనాయిక. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.