
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న బ్రో చిత్ర ప్రమోషన్స్ జోరు పెరుగుతోంది. తమిళ దర్శకుడు, ప్రముఖ నటుడు సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో రూపొంది హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా సముద్రఖని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ కి స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. జూలై 8 శనివారం సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్, తేజు ఫ్లోర్ అదిరిపోయేలా డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో యమా స్టైలిష్ గా ఒకరిని మించే విధంగా ఒకరు ఉన్నారు. 'మై డియర్ మార్కండేయ' అంటూ ఈ సాంగ్ ఉండబోతున్నట్లు పోస్టర్ లో తెలిపారు. హిందూ పురాణాలలో చావుకి ఎదురెళ్లి గెలిచిన మార్కండేయుడి కథ విన్నాం.
ఈ చిత్రంలో కూడా సాయిధరమ్ తేజ్ ఓ యాక్సిడెంట్ లో మరణించిన వ్యక్తిగా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ భగవంతుడిగా అతడి కోసం దిగి వస్తాడు. ఈ కథాంశంతో బ్రో చిత్రం ఉండబోతోంది. సాంగ్ ఎలా ఉన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ మొత్తం తేజు, పవన్ కలసి చేయబోయే డ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జూలై 28న బ్రో మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది.