
చిరు 150వ సినిమా దర్శకుడు ఎవరా అని గతంలో అంతా యాంగ్జయిటీతో ఎదురు చూస్తున్న సమయంలో బోయపాటి శ్రీను పేరు కూడా బాగానే వినిపించింది. అయితే ఆ మూవీకి మెగా స్టార్ తన ఠాగూర్ దర్శకుడు వినాయక్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక చిరంజీవి 151వ సినిమా బోయపాటితో ఉండవచ్చనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అదే టాక్ ఇప్పుడు నిజమైందనేది తాజా సమాచారం.
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతోన్న 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ పూర్తికావొచ్చింది. దాంతో ఆయన 151వ సినిమాపై దృష్టి పెట్టారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. ఈ బ్యానర్ కి బోయపాటి 'సరైనోడు'తో మంచి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు చిరు తదుపరి సినిమా బాధ్యతలను కూడా బోయపాటికి అప్పగించాలని అల్లు అరవింద్ భావించాడు.
మెగాస్టార్ కూడా తన 151వ సినిమాకు బోయపాటికి దర్శకునిగా ఓకే చెప్పేశారట. ఈ చిత్రానికి ఏప్రిల్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, మే నుంచి రెగ్యులర్ షూటింగును ప్రారంభించాలనే ఆలోచనలో వున్నారని చెప్పుకుంటున్నారు.