ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది `ఆదిపురుష్` టీమ్. చిత్ర ప్రమోషన్స్ ని ఈ నెలాఖరు నుంచే ప్రారంభించబోతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఏ ఒక్క సినిమా నుంచి కూడా అప్ డేట్ రావడం లేదు. అప్పుడు ఇప్పుడు అని ఊరించడం తప్ప చిత్ర బృందాల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నారు ప్రభాస్. అభిమానులు సైతం శోససంద్రంలో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలో ఫుల్ ఎనర్జీనిచ్చే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కి `ఆదిపురుష్` టీమ్ రెడీ అవుతుందట. ఈ దసరా కానుకగా ఈ సినిమా నుంచి ఊహించని ట్రీట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఈ నెలాఖరు నుంచి `ఆదిపురుష్` ప్రమోషన్స్ ప్రారంభించబోతున్నారట. ఈ నెల 26న ఈ చిత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేయబోతున్నట్టు సమచారం. ఇక పండక్కి `ఆదిపురుష్` టీజర్ ని విడుదల చేయబోతుందని, అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తుంది.
విజయ దశమి సందర్భంగా రాముని జన్మస్థలం అయోధ్యంలో `ఆదిపురుష్` టీజర్ని విడుదల చేయాలని, అక్టోబర్ 3న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు టాక్. గ్రాండ్ గా ఈ లాంచింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తుందట. ఇదిలా ఉంటే ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. దీనికి ఈ సారి ప్రభాస్ని గెస్ట్ గా ఆహ్వానించినట్టు తెలుస్తుంది.
ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. దీంతో రవాణ దహన కార్యక్రమానికి ప్రభాస్ కన్నా మించిన అతిథి లేరు అంటూ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పురాణాల్లో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి వేడుకల్ని ఇండియా మొత్తం ఘనంగా జరుపుకుంటుంది. పది తలల రావణాసుర భారీ విగ్రహాన్ని తయారు చేసి దసరా ఉత్సవాల చివరి రోజున దహనం చేస్తారు. ప్రభాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయాన్ని లవ్ కుశ రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ధ్రువీకరించారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. ఓ వైపు `ఆదిపురుష్` ట్రీట్స్, మరోవైపు ప్రభాస్కి ఇంతటి గౌరవం దక్కుతున్న నేపథ్యంలో అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12న పాన్ వరల్డ్ స్కేల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.