
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి `వాల్తేర్ వీరయ్య`తో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు. తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫ్యాన్స్ కి పూనకాలతో ఊగిపోయారు. దాన్ని కొనసాగించేందుకు ఇప్పుడు `భోళా శంకర్` చిత్రంతో వస్తున్నారు చిరంజీవి. ఆయన హీరోగా నటించిన మరో చిత్రమిది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కీలక పాత్ర పోషిస్తుంది. చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది.
తాజాగా `భోళా శంకర్` టీజర్ రిలీజ్ అయ్యింది. మాస్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో ఈ టీజర్ సాగడం విశేషం. చిరంజీవి ఓ రకంగా మాస్ ర్యాంపేజ్ ఆడుకున్నారు. 33 మందిని ఒక్కడు చంపాడనే అంశంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఎవర్రా నువ్వు అని విలన్లు అనగా, షికారుకి వచ్చిన షేర్ని బే అంటూ మాస్ లుక్లో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చెప్పడం విశేషం. విలన్లని ఓ ఆట ఆడుకుంటూ వారిని అంతం చేస్తాడు. అందులోనే ఎట్టించినా.. అని, అన్నా మస్త్ ఇచ్చినవ్ అన్నా.. అంటూ గెటప్ శ్రీను చెప్పడం ఆకట్టుకుంది.
చివర్లో విలన్.. ఏ భోళా ఇది నా ఏరియా అని చెప్పగా, స్టేట్ డివైడ్ అయినా అందరు నావాళ్లే, అన్ని ఏరియాలు నావే, నాకు హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్ అంటూ చిరు చెప్పడం హైలైట్గా నిలిచింది. టీజర్ ఫుల్ మీల్స్ తో సాగడం విశేషం. యాక్షన్, లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎలిమెంట్లు మేళవింపుగా టీజర్ ఉంది. ఈ సినిమా తమిళంలో వచ్చిన `వేదాళం`కి రీమేక్. తెలుగు కి అనుగుణంగా మార్పులు చేశారు. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది.