
ఇటీవల `మీటర్`తో షాకింగ్ చవిచూసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు `రూల్స్ రంజన్`తో వస్తున్నారు. ఈ సారి గట్టిగా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. `డీజే టిల్లు` బ్యూటీ నేహా శెట్టితో కలిసి కిరణ్ `రూల్స్ రంజన్` చిత్రంలో నటిస్తున్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఏ ఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
యంగ్ సెన్సేషన్గా మారిన కిరణ్, నేహా శెట్టి కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో `రూల్స్ రంజన్`పై ప్రారంభం నుంచి అంచనాలు నెలకొన్నాయి. పైగా టైటిల్ సైతం కొత్తగా ఉండటంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమా నుంచి నయా అప్డేట్ వచ్చింది. `నాలో నేనే లేను` అనే పాటని విడుదల చేశారు. `నాలో నేనే లేను` లిరికల్ వీడియోని సోమవారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం. తన ప్రేమను హీరోయిన్కి చెప్పడం కోసం హీరో పడే తపన ఈ పాటలో చూపించారు. కళ్లద్దాలు, నుదుటున బొట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న కథానాయకుడు.. నాయికని ఫాలో అవుతూ ఆమె గురించి పాడుకోవడం ఆకట్టుకుంది.
లిరికల్ వీడియోలో నాయికలా నాట్యం చేయబోయి కథానాయకుడు కిందపడటం, ఆమె నడిచొస్తుంటే అతను పూలు చల్లడం వంటి సరదా సన్నివేశాలు అలరించాయి. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం వినసొంపుగా, ఆహ్లాదకరంగా ఉంది. సంగీతానికి తగ్గట్టుగానే రాంబాబు గోసాల అందించిన సాహిత్యం ఎంతో హాయిగా, స్వచ్ఛంగా ఉంది. అందరికీ అర్ధమయ్యే భాషలో ఎంతో అర్థవంతంగా పాటను రాశారు. ఇక శరత్ సంతోష్ ఎంతో అందంగా పాటను ఆలపించి కట్టిపడేశారు.
గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. `రూల్స్ రంజన్` చిత్రంలో `నాలో నేనే లేను` అనే పాట రాసినందుకు చాలా సంతోషం, మా దర్శకులు రత్నం కృష్ణ చాలా మంచి సందర్భాన్ని నాకు వివరించారు. చాలా అందమైన చిన్న చిన్న పదాలతో తన ప్రేమని కథానాయిక కి తెలియజేయడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చెప్పాము. 'నాలో నేనే లేను నీలోనే ఉన్నాను' అంటూ మొదలయ్యి నేను ఊహల్లో లేను ఎప్పుడూ నీ ఊసుల్లోనే ఉంటున్నాను నువ్వు ఏం మాయ చేసావు నీ రూపం ఒక మాయ నువ్వే ఒక మాయ నాకు నిద్ర పట్టట్లేదు కానీ చాలా హాయిగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు అనుకుంటూ తన ఫీలింగ్స్ ని చెప్పుకునే పాట.
చాలా అందమైన బాణీకి చాలా మంచి తేలిగ్గా పాడుకునేటట్లుగా ఉండే పదాలతో పాటని రాయమని చెప్పారు. చరణాలు కవితాత్మకంగా చెప్పాము.పువ్వులా నువ్వు వస్తే నీ నుంచి వచ్చే పరిమళాల గాలి నాతో మాట్లాడింది అని, నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతుంటే నన్ను నేను మర్చిపోయానని చరణాలు స్టార్ట్ అవుతాయి. నాతో ఇంత మంచి పాట రాయించినందుకు మా దర్శకులకి కృతజ్ఞతలు, అలాగే హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం నేహా శెట్టి ఈ పాటలో చాలా అందంగా కనిపించారు. చాలా చాలా బాగుంది విజువల్ గా, సంగీత దర్శకులు అమ్రిష్ గారు చాలా మంచి బాణీ అందించారు. అలాగే గాయకులు శరత్ సంతోష్ చాలా బాగా పాడారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను` అని అన్నారు.
`వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ,ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటం తో పాటు, పూర్తి స్థాయి వినోద భరితంగా సాగుతుంది. సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు చిత్ర కథ, నాయకా నాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచి చిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశార`ని చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, దర్శకుడు రత్నం కృష్ణ. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జులై నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.