
బలగం మూవీలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. అంతగా ఈ మూవీ జనాలను ప్రభావితం చేసింది. కొమురయ్య, ఐలయ్య, సాయిలు, లక్ష్మి, నారాయణ, సంధ్య బలగం మూవీ లోని పల్లెటూరి కుటుంబ సభ్యుల పాత్రలు. చనిపోయిన కొమురయ్య అల్లుడు నారాయణ పాత్రను మురళీధర్ గౌడ్ చేశారు. అలిగి అత్తింటికి దూరమైన అల్లుడిగా, బామ్మర్దులు అంటే గిట్టని బావగా ఆయన అద్భుతంగా నటించారు. బలగం మూవీతో మురళీధర్ గౌడ్ ఫేమ్ బాగా పెరిగింది.
మురళీధర్ గౌడ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒకప్పటి కుటుంబ ఆర్థిక కష్టాలు తలచుకుని ఎమోషనల్ అయ్యారు. మాది మెదక్ జిల్లా రామాయంపేట. మేము నలుగురు అబ్బాయిలం, ఒక అమ్మాయి . కటిక పేదరికం అనుభవించాము. నేడు డిగ్రీ చదివే రోజుల్లో ఇంట్లో పది రూపాయలు ఉండేవి కావు. ఆ పది రూపాయల కోసం మా అమ్మ బంధువుల ఇళ్లకు అప్పు తెమ్మని పంపేది. నాకేమో సిగ్గు, భయంగా ఉండేది.
నాన్న వేరే ఊర్లో పని చేస్తుండేవాడు. ఆయన వచ్చినప్పుడు తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాళ్ళం. నేను చిరిగిన బట్టలతో తిరిగేవాడిని. అందరూ ఎగతాళి చేసేవారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 27 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నాను. అప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మా జీవితాలు అంతంత మాత్రమే... అని ఆయన ఎమోషనల్ అయ్యారు.
కాగా బలగం మూవీ ఛాన్స్ మురళీధర్ గౌడ్ కోల్పోయేవాడట. నిర్మాత దిల్ రాజు తనను వద్దన్నారట.ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. బలగం మూవీలో నటించే యాక్టర్స్ ఫొటోలన్నీ డైరెక్టర్ వేణు నిర్మాత దిల్ రాజు టేబుల్ మీద పెట్టారు. అన్ని ఫోటోలు చూసిన దిల్ రాజు మురళీధర్ ని వద్దన్నారట. వేరే నటుడిని తీసుకుందాం అన్నారట. అయితే వేణు ఆయన్ని ఒప్పించారు. అలా మురళీధర్ కి నారాయణ పాత్ర దక్కిందట. నిజంగా ఛాన్స్ కోల్పోతే మురళీధర్ కి చాలా నష్టం జరిగేది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా బలగం మూవీ గురించే చర్చ నడుస్తుంది. సినిమా గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమ్రోగుతుంది. ఈ పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. దాదాపు రూ. 22 కోట్ల గ్రాస్ రూ. 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ప్రస్తుతం బలగం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది.