
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, లక్ష్య లల్వాని జంటగా నటించిన ‘చాంద్ మేరా దిల్’ సినిమా మే 22న విడుదలైంది. కాలేజీ రోజుల్లో ప్రేమలో పడిన ఓ జంట కథ ఇది. అనుకోకుండా గర్భం దాల్చడంతో వాళ్ల జీవితం తలకిందులవుతుంది. ఆ తర్వాత వచ్చే అపార్థాలు, బాధ్యతల మధ్య వాళ్ల బంధం ఎలా చిక్కుల్లో పడిందనేది ఈ సినిమా కథ. ఇందులో నటీనటుల నటనకు మంచి మార్కులే పడుతున్నా, అనన్య పాండే చేసిన ఓ డ్యాన్స్ మాత్రం ఇప్పుడు పెద్ద రచ్చకు కారణమైంది.
సినిమాలో అనన్య చేసిన ‘భరతనాట్యం ఫ్యూజన్’ డ్యాన్స్పై సోషల్ మీడియాలో జనాలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సినిమాలో చాందిని పాత్ర చేసిన అనన్య, కాలేజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో భరతనాట్యం చేస్తుంది. ఆ డ్యాన్స్ చూసి హీరో ఆరవ్ మైమరచిపోతాడు. కానీ, బయట ఆడియన్స్ మాత్రం ఆమె డ్యాన్స్ చూసి మండిపడుతున్నారు.
ఓ ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "అనన్య పాండే భరతనాట్యాన్ని ఇంకా నాశనం చేయకముందే దయచేసి ఎవరైనా ఆపండి. వెనుక నటరాజ విగ్రహం పెట్టుకుని ఇలా డ్యాన్స్ చేయడానికి ఎంత ధైర్యం..." అని పోస్ట్ చేశారు.
మరో నెటిజన్ అయితే, "క్రీస్తు పూర్వం 200లో భరతనాట్యం పుట్టింది. 2026లో అనన్య పాండే చేతిలో అంతమైంది" అని ఘాటుగా సెటైర్ వేశారు.
ఇంకో యూజర్, "చివర్లో ఆడియన్స్ చప్పట్లు కొట్టింది ఆమె డ్యాన్స్ నచ్చా? లేక ఆ టార్చర్ అయిపోయిందనా? అని ఇంకా ఆలోచిస్తున్నా" అంటూ కామెంట్ చేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ అనితా ఆర్. రత్నం ఈ వీడియో చూసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "ఈ వీడియో చూస్తుంటే శాస్త్రీయ నృత్యం ప్రాణం కోల్పోయినట్టుంది. ఆమె చేతుల కదలికలు, కెమెరా యాంగిల్స్ చూస్తుంటే... చిన్నపాటి భూకంపం వచ్చినప్పుడు వెడ్డింగ్ సంగీత్ వీడియో తీసినట్టుంది. శాస్త్రీయ నృత్యం తన బ్యాగ్ సర్దుకుని థియేటర్ నుంచి పారిపోయినట్లు అనిపిస్తోంది" అని విమర్శించారు.
"భరతనాట్యం అంటే కఠినమైన టెక్నిక్, నియంత్రణ, సంప్రదాయం, సంగీత జ్ఞానం, భావోద్వేగం కలగలిసిన కళ. ఈ డ్యాన్స్ చెత్తగా ఉందని కాదు బాధ... కొన్నిసార్లు చెత్త కూడా ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ, శతాబ్దాల సంస్కృతిని, సాధనను, భక్తిని ఇంత నమ్మకంతో నాశనం చేశారు కదా, అదీ అసలైన విషాదం" అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.
కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు కృతికా శివస్వామి స్పందిస్తూ, "సినిమా వాళ్లకు శాస్త్రీయ కళల పట్ల ఎంత అగౌరవం ఉందో అనన్య డ్యాన్స్ చూపిస్తోంది. మన దేశంలో ఇలాంటి వాటిపై కేసులు వేసే కఠినమైన చట్టాలు లేవు. అందుకే ఎవరు పడితే వాళ్లు ఇలాంటి చెత్తను సృష్టిస్తున్నారు" అని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకురాలు, డాక్టర్ షమా మొహమ్మద్ కూడా స్పందించారు. "నాకు అత్యంత ఇష్టమైన భరతనాట్యాన్ని అనన్య పాండే ఖూనీ చేసింది! నేను 7 నుంచి 13 ఏళ్ల వరకు కువైట్లో ఈ డ్యాన్స్ నేర్చుకుని 'అరంగేట్రం' కూడా చేశాను. దయచేసి భరతనాట్యం లాంటి అందమైన కళను అవమానించకండి" అని విజ్ఞప్తి చేశారు. మరో యూజర్ అయితే, "ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ చేతికి రక్తం అంటింది. ఆమె డ్యాన్స్ చూస్తున్న నా కళ్లలోంచి ఆ రక్తం వస్తోంది" అని కామెంట్ చేశారు.
అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం కొన్ని సెకన్ల క్లిప్ మాత్రమే. సినిమాలో ప్రియా మాధురి పాడిన పాటకు ఆధునిక ట్యూన్స్ జోడించి ఈ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇది పూర్తి సంప్రదాయ భరతనాట్యం కాదు, కేవలం ఒక 'ఫ్యూజన్' డ్యాన్స్ మాత్రమే. కానీ, పూర్తి విషయం తెలుసుకోకుండా నెటిజన్లు కేవలం చిన్న క్లిప్ చూసి అనన్యను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.