దక్షిణాది సినీ తార అమలా పాల్పై ఫోర్జరీ కేసులో ఆరోపణలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అమల తన కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సందర్భంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ కేసును కేరళ హైకోర్టు పరిశీలిస్తోంది. దీంతో అమల కేరళ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకుంది.
అమల స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం. కొన్ని నెలల క్రితం అమల దాదాపు కోటి రూపాయలు విలువైన బెంజ్ కారు కొనుక్కుంది. అయితే ఈ కారుకు సంబంధించిన డాక్యుమెంట్లలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు డాక్యుమెంట్లలో అడ్రెస్ వివరాలు పొందుపరిచింది. ఈ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసిందని అమలపై ఆరోపణలు వస్తున్నాయి. దాంతో కేరళ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వద్ద అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ అమలపై కేసు పెట్టారు. అమల ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల కేరళ రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే తాను గతంలో పుదుచ్చేరిలోనే నివసించేదాన్నని, తన సొంత ఇంటిని అద్దెకు ఇచ్చానని అమల అంటోంది. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటోంది. ఇక తమిళ నటుడు ఫహాద్ ఫాసిల్, నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్ గోపిపై కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి.