
తెలుగు ఇండియన్ ఐడల్ 2 విజేతగా సౌజన్య నిలిచింది. వైజాగ్కి చెందిన సౌజన్య భగవతులకి గెస్ట్ గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బహుబతి అందజేశారు. టైటిల్తోపాటు రూ.10లక్షల ప్రైజ్ మనీ అందజేశారు బన్నీ. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో తెలుగు ఇండియన్ ఐడల్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ ప్రారంభించారు.తాజాగా నేటితో అది ముగింపుకి చేరుకుంది.
అల్లు అర్జున్ గెస్ట్ గా ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ జరిగింది. తెలుగు ఇండియన్ ఐడల్ 2 షోకి న్యాయ నిర్ణేతలుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, సింగర్స్ కార్తిక్, గీతా మాధురి వ్యవహరించారు. హేమచంద్ర దీనికి హోస్ట్ గా వ్యవహరించారు. ఆయన తనదైన హోస్టింగ్తో ఫైనల్గా స్పెషల్గా మార్చారు. ఈ రెండో సీజన్కి పదివేల మంది ఆడిషన్స్ లో పాల్గొనగా, అందులో 12 మంది టైటిల్ కోసం పోటీ పడ్డారు. చివరగా ఐదుగురు గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు. వారిలో న్యూజెర్సీకి నుంచి శృతి, హైదరాబాద్ నుంచి జయరాం, సిద్ధి పేట ఉనంచి లాస్య ప్రియ, హైదరాబాద్ నుంచి కార్తీక్, వైజాగ్ నుంచి సౌజన్య భాగవతుల ఈ పోటీలో పాల్గొన్నారు. ఉత్కంఠభరిత పాటల పోటీలో చివరగా సౌజన్యని విజేతగా నిలిపారు. జయరాం, లాస్య ఫస్ట్,సెకండ్ రన్నరప్లుగా నిలిచారు.
విజేతకి ట్రోఫీ అందజేసిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ, `ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, సంగీతంలో ఎంతో ప్రతిభావంతులైన వీరి ప్రదర్శన చూసి మనసంతా ఆనందంతో నిండిపోయిందని, సంగీతంపై మరింత ప్రేమ పెరిగిందన్నారు. ఈ షో నాకెంతో ప్రత్యేకమైనదని, మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిందన్నారు. ఈ సందర్భంగా విజేత సౌజన్యకి అభినందనలు తెలిపారు బన్నీ. రెండేళ్ల చిన్నారికి తల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొనడం, ఓ వైపు సంగీతం, మరోవైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంత ఈజీ కాదని, ఆమె అంకిత భావం, నిబద్దత చూస్తే గౌరవం పెరిగిందన్నారు.
విన్నర్ సౌజన్య మాట్లాడుతూ, `తెలుగు ఇండియన్ ఐడల్ 2లో విజేతగా నిలవడం, అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. కల నిజమైనట్టు ఉంది. ఆయన అందించిన ప్రోత్సాహం, ప్రశంసలను నేనెప్పటకీ మర్చిపోను. ఈ మ్యూజికల్ జర్నీ నాలోని పట్టుదలను మరింత గా పెంచింది. ఇంత గొప్ప వేదికను అందించిన ఆహా వారికి, న్యాయనిర్ణేతలకు, నా తోటి కంటెస్టెంట్లకి, వెనక ఉంది ప్రోత్సహించిన టీమ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను` అని తెలిపింది.