
ఇటీవల కాలంలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘ అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతో విజయ్ దేవర కొండ క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది. హీరోతో పాటు హీరోయిన్ షాలినీ పాండే కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు బాల ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
మరోవైపు సినిమాలో నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ముందుగా హీరోయిన్ను వెతికే పనిలో ఉన్నారు. ధృవ్ సరసన హీరోయిన్గా ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినపడుతున్నాయి. ఒకరు విలక్షణ నటుడు కమలహాసన్ కుమార్తె అక్షర హాసన్ కాగా.. మరొకరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన శ్రియా శర్మ.
అక్షర బాలీవుడ్ లో నటించినా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక శ్రియా..ఇటీవల తెలుగులో ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో నటించింది. ధృవ్ సరసన కూడా ఆమె చక్కగా సరిపోతుందని అనుకుంటున్నారు. వీరిద్దరిపై ఓ ఫోటోషూట్ నిర్వహించి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. చివరికి ఎవరు ఒకే అవుతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.