
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ప్రభాస్ తొలిసారి పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో నటించడంతో ఆదిపురుష్ పై విపరీతమైన హైప్ ఉంది. రామాయణం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ చిత్ర యూనిట్ అనేక వివాదాలు ఎదుర్కొంది.
రామాయణాన్ని దర్శకుడు ఓం రౌత్ సరిగ్గా తెరకెక్కించడం లేదని.. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు ఇలా ఈ పాత్రల్లో నటిస్తున్న వారి గెటప్స్ సరిగ్గా లేవని వరుసగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే సినిమాపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు ఓం రౌత్ ప్రకటిస్తూ.. ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఆంజనేయ స్వామి కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయించబడుతుందని తెలిపారు. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడని ప్రతీతి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓం రౌత్ తెలిపారు.
అయితే దీనిపై కూడా పుకారు రాయుళ్లు రూమర్స్ క్రియేట్ చేశారు. ఆదిపురుష్ చిత్ర యూనిట్ హనుమంతుడి ప్రత్యేకంగా సీట్ కేటాయిస్తోంది భక్తితో కాదని.. దానిని కూడా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాబట్టి హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరల్ని అధిక మొత్తంలో పెంచి విక్రయించబోతున్నట్లు వార్తలు సృష్టించారు.
ఈ రూమర్ పై చిత్ర యూనిట్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవం. అలాంటి ఫేక్, ఫాల్స్ న్యూస్ నమ్మొద్దు. హనుమంతుడి పక్క సీట్ల టికెట్ ధరలు కూడా నార్మల్ గానే ఉంటాయి. ఎలాంటి మార్పు ఉండదు అని క్లారిటీ ఇచ్చారు.