
ప్రముఖ నటి వాణి విశ్వనాథ్(Vani Viswanath) సంచలన ప్రకటన చేసింది. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఏకంగా ఆమె రోజాపై పోటీకి దిగబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజక వర్గం నుంచి తాను బరిలోకి దిగుతానని తెలిపింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తనకు వేలాదిగా అభిమానులున్నారని, వారి కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు నటి వాణి విశ్వనాథ్ వెల్లడించారు. అయితే రోజా నగరి నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
బుధవారం వాణి విశ్వనాథ్ నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏ పార్టీనుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. నగరి నియోజకవర్గంలో పోటీ చేయడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తమ మేనేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేకే ఎలక్షన్ లో పోటీ చేయడానికి సిద్ధపడినట్టు చెప్పింది వాణి విశ్వనాథ్.
నలుగురికి సాయం చేసే వ్యక్తి ఇలా ఇబ్బందుల పాలైతే, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోననే ఆవేదనతో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. నగరలో తన అమ్మమ్మ నర్సుగా పనిచేశారని, ఈ ప్రాంత వాసులు తనకు సుపరిచితులని గుర్తు చేశారు. నగరిలో తమిల సంస్కృతి ఉందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్ల వేళలా సిద్ధమని తెలిపింది. అవసరమైతే ఇండిపెండెంట్గా సైతం పోటీకి సిద్ధమే అని వెల్లడించింది. అయితే నటి వాణి విశ్వనాథ్ పర్యటన నేపథ్యంలో స్థానిక మహిళలు ఆమెకి స్వాగతం పలికారు.ఇదిలా ఉంటే వాణి విశ్వనాథ్ 2017లో టీడీపీ చేరిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే వాణి విశ్వనాథ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా మలయాళంకి చెంది వాణి విశ్వనాథ్ 1988 నుంచి ఆ మధ్య వచ్చిన `ఒరేయ్ బుజ్జిగా` వరకు పదుల చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తెలుగులో ప్రధానంగా `ధర్మ తేజ`, `సింహ స్వప్నం`, `కొదమ సింహాం`, `ఘారానా మొగుడు`, `ప్రేమయుద్ధం`, `సామ్రాట్ అశోక్`, `గ్యాంగ్ మాస్టర్`, `జయ జానకి నాయక`వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.