సీరియల్ నటి తునీషా మృతి కేసు.. సహనటుడు షీజాన్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..!

By Sumanth KanukulaFirst Published Dec 25, 2022, 1:10 PM IST
Highlights

మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని వాసాయిలో సీరియల్ సెట్‌లో నటి తునీషా శర్మ ఆత్మహత్య  చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 

మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని వాసాయిలో సీరియల్ సెట్‌లో నటి తునీషా శర్మ ఆత్మహత్య  చేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ టీ బ్రేక్ తర్వాత వాష్ రూమ్‌కు వెళ్లిన తునీషా శర్మ.. అక్కడే ఉరివేసుకుని కనిపించింది. దీంతో తునీషాను అక్కడివారు ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి తునీషా తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తునీషా తల్లి ఫిర్యాదు మేరకు తునీషా సహ  నటుడు షీజాన్ మహమ్మద్ ఖాన్‌‌పై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద కేసు నమోదు చేశారు. 

షీజాన్‌ను అరెస్ట్ చేసిన వలీవ్ పోలీసులు.. ఈ రోజు ముంబై‌లోని కోర్టులో హాజరుపరిచారు. ఇక, తునీషా, షీజాన్‌లు కలిసి అలీబాబా దస్తాన్-ఎ-కాబుల్ షోలో కలిసి పనిచేశారు. అయితే ఈ కేసు ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. కొంతకాలంగా తునీషా శర్మ, షీజన్ ఖాన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంట 15 రోజుల క్రితం విడిపోయారు. విడిపోవడం వల్ల తునీషా ఒత్తిడికి లోనైంది.

మరోవైపు ఆదివారం తెల్లవారుజామున జెజె ఆసుపత్రిలో తునీషా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. తునీషా ఊపిరాడక చనిపోయిందని, ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్టుగా పలు ఆంగ్ల మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. తునీషా మృతికి సంబంధించి హత్యా?, ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక,  ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆ సమయంలో సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇక, 2002లో చండీగఢ్‌లో జన్మించిన తునీషా 14 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించింది.  అలీబాబా దస్తాన్-ఎ-కాబుల్, భరత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్‌తో  సహా అనేక ఇతర టెలివిజన్ షోలలో కూడా నటించింది. ఫితూర్, బార్ బార్ దేఖో వంటి చిత్రాలలో ఆమె యువ కత్రినా కైఫ్ పాత్రను పోషించింది. ఆమె కహానీ 2లో విద్యాబాలన్‌తో స్క్రీన్‌ను పంచుకుంది. 

click me!