
మిగతా హీరోయిన్ల లాగా గ్లామర్ షోలు, ఎక్స్పోజింగ్లకు పోకుండా.. నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ ముందుకు వెళ్తున్న సహజ నటి సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. తొలి సినిమాతోనే పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలంగాణ యాసలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకొని సభాష్ అనిపించుకున్నారు. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఇమేజ్ మాత్రం స్టార్ హీరో రేంజ్ అనేది అందరూ ఒప్పుకునే మాట.
లాస్ట్ ఇయిర్ ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో హిట్లు అందుకోవడమే కాకుండా తన నటనకు మరోసారి మంచి మార్కులు వేయించుకున్నారు సాయి పల్లవి. ఈ ఏడాది రానా దగ్గుబాటితో కలిసి నటించిన ‘విరాట పర్వం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాయి పల్లవి నటన అందరినీ కట్టిపడేయటమే అందుకు కారణం. అయితే, ఈ సినిమా మాత్రం కమర్షియల్ వర్కవుట్ కాలేకపోయింది. ఆ తరవాత సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన లేడీ-ఓరియెంటెడ్ మూవీ ‘గార్గి’ జస్ట్ ఓకే అనపించుకుంది. ఈ రెండు సినిమాల తరవాత సాయి పల్లవి మరో సినిమాను ఇప్పటి వరకు సైన్ చేయలేదు.అయితే తాజాగా ఓ సినిమా కమిటైంది.
అందుతున్న సమాచారం మేరకు ఆమె మళయాళ హీరో నివీన్ పౌలి తో సినిమా చేయటానికి సైన్ చేసింది. నివీన్ పౌలి,సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమమ్ మళయాళంలో పెద్ద హిట్. దాంతో వీళ్ల ఇద్దరి కాంబో ప్రాజెక్టుకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చే అవకాసం ఉంది. ఆ సినిమాలో నివీన్ పౌలి చేసిన జార్జ్ పాత్రను, సాయి పల్లవి చేసిన మిస్ మలర్ పాత్రను మర్చిపోలేరు. దాంతో వీళ్లిద్దరు కలిసి తారం అనే చిత్రం చేయబోతున్నారు. వివేక్ రంజిత్ స్క్రిప్టు రాసిన ఈ చిత్రాన్ని వినయ్ గోవింద్ డైరక్ట్ చేయబోతున్నారు. మనాలీ బ్యాక్ డ్రాప్ లో చిత్రం రూపొందనుంది.
ఇదిలా ఉంటే తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అజిత్ ఇటీవలే తునీవు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అజిత్ నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ సినిమాలో హీరోయిన్ కోసం రకరకాల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్ గా సాయి పల్లవి పేరు ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని చెప్తున్నారు.