సీనియర్ నటి కవిత భర్త దశరథ రాజు కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనాతోనే కవిత కుమారుడు స్వరూప్ మరణం మరువక ముందే ఆమె ఇంట్లో మరో విషాదం చోటు చేసుకోవడం విచారకరం.
కరోనా సినీ నటి ఇంట విషాదాన్ని నింపింది. సీనియర్ నటి కవిత భర్త దశరథ రాజు కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనాతోనే కవిత కుమారుడు స్వరూప్ మరణం మరువక ముందే ఆమె ఇంట్లో మరో విషాదం చోటు చేసుకోవడం విచారకరం. ఇటీవల కరోనాకి గురైన దశరథ రాజు కరోనాతో పోరాడుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కవిత కుమారుడు జూన్ 15న కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు. తాజాగా ఆమె భర్త దశరథ రాజు కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో నటి కవిత ఒంటరైపోయారు.
దీంతో నటి కవిత భర్త మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నటి కవిత చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1976 లో తమిళంలో `ఓహ్ మంజు`, తెలుగులో `సిరి సిరి మువ్వ`తో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టారు. కవిత కేవలం 11 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విజయవంతంగా రాణించారు. అప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, చంద్రమోహన్తో పాటు చిరంజీవి సరసన హీరోయిన్గా నటించారు.
ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న కవిత మళ్లీ 1991 నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఆమె 350కిపైగా చిత్రాల్లో నటించి అలరించారు. టీవీ సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో `ఊహలు గుసగుసలాడే` సీరియల్లో నటిస్తుంది. అలాగే `ఎండ్రాండ్రం పున్నగై` అనే తమిళ టీవీ షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టీవ్గా ఉంటున్నారు. బీజేపీ పార్టీలో నాయకురాలిగా ఉన్నారు.