
నటుడు నరేష్ పెళ్లి వార్తలు ఇటు టాలీవుడ్లో, అటు కన్నడనాట హాట్ టాపిక్ అవుతున్నాయి. నరేష్ నటి పవిత్ర లోకేష్ని వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి ఆ మధ్య మహాబలేశ్వరం స్వామివారిని దర్శించుకుని, పూజలు నిర్వహించినప్పటి నుంచి నరేష్, పవిత్ర లోకేష్ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంలోకి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి వచ్చారు. నరేష్పై పలు సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా నటుడు నరేష్ స్పందించారు. రమ్య రఘుపతి చేసే ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. బెంగుళూరులో ఓ బ్లాక్ మెయిల్ చానెల్తో కలిసి తనపై వదంతులు సృష్టించిందని ఆయన తెలిపారు.ఈ మేరకు ఓ టీవీ చానెల్తో నరేష్ మాట్లాడారు. ఈసందర్భంగా పలు సంచలన ఆరోపణలు చేశారు నరేష్. యాభై లక్షల కోసం ఇంట్లో వాళ్లని పీడించిందన్నారు. మా ఫ్యామిలీని విడగొట్టాలని చూసిందన్నారు. మమ్మల్ని డబ్బు కోసం పీడిస్తుందని రివర్స్ ఆరోపణలు చేశారు.
రమ్య రఘుపతికి విడాకుల నోటీసు పంపి నెల రోజులవుతుందని, ఆ డైవర్స్ నోటీస్ పంపిన తర్వాతనే తనకు పెళ్లి కాబోతుందనే రూమర్ క్రియేట్ చేసిందన్నారు. పవిత్ర లోకేష్ తో పెళ్లి అనే రూమర్స్ సృష్టించిందని వెల్లడించారు. కన్నడ మీడియాకి దీనిపై వివరణ ఇచ్చానని తెలిపారు నరేష్. రమ్య రఘుపతి చేసిన మోసాలు, బ్లాక్ మెయిల్ అవమానకరం అని, ఆమె ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ ఇష్యూపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అంతకు ముందు స్పందిస్తూ, నరేష్కి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు ఇచ్చేది లేదని తెలిపారు. తాను నరేష్తోనే ఉంటానని ఆయన తల్లి విజయ నిర్మలకు మాటిచ్చానని, దానికి కట్టుబడి ఉంటానని ఆమె చెప్పారు. విజయ నిర్మల చివరి రోజుల్లో తన దగ్గర మాట తీసుకుందని వెల్లడించింది.
అంతేకాదు నరేష్పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నరేష్ జీవితంలో ఎంతో మంది మహిళలున్నారని ఆరోపించింది. ఇతర ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకుని చాలా సార్లు దొరికిపోయాడని, దొరికిన ప్రతిసారి ఇంకెప్పుడూ ఇలా చేయనని అంటారని, కానీ తర్వాత మళ్లీ అదే చేస్తాడని చెప్పింది. పవిత్ర లోకేష్తో ఆయనకున్నసంబంధంపై స్పందిస్తూ, ఈ ఆరోపణలు రావడానికి చాలా రోజుల క్రితం ఒకసారి ఇంటికి వచ్చారని, ఆవిడది కూడా కర్నాటకనే కావడం వల్ల ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టానని రమ్య పేర్కొన్నారు.
డైవర్స్ పై స్పందిస్తూ విడాకులు ఇవ్వడమనేది పెద్ద లీగల్ ప్రాసెస్ అని, దానికి చాలా టైమ్ పడుతుందని చెప్పారు. జనవరిలో నరేష్ కేసు పెట్టారని, అప్పుడు తాను ఆ ఇంట్లోనే ఉన్నానని, నోటీసులు తన వరకు రాకుండా గేటు వద్ద నుంచే వెనక్కి పంపించారని చెప్పారు. జూన్లో పోస్ట్ మాస్టర్ తన నంబర్కి కాల్ చేసి చాలా సమన్లు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. ఆ కోర్ట్ సమన్లు అన్నీ బెంగుళూరు అడ్రస్కు పంపమని తాను కోరానని, ఆ నోటిసులు తన వరకు వచ్చాకనే తాను చూశానని, అవి విడాకుల నోటీసులు అని అప్పుడే తెలిసిందని, దీనిపై త్వరలోనే స్పందిస్తానని తెలిపింది రమ్య రఘుపతి.