
మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ తరుపున రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పోసాని, అలీ, కొరటాల శివ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. వీరందరితో కలసి చిరంజీవి జగన్ కి టాలీవుడ్ సమస్యలు వివరించారు. తగ్గించిన టికెట్ ధరలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే అవసరాన్ని బట్టి 5 షోలు కూడా వేసుకునే వెసులుబాటు కల్పించాలని కూడా కోరారు.
దీనితో జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ప్రభుత్వం నుంచి శుభవార్తగా జీవో విడుదలవుతుందని ఆశిస్తున్నారు. దీనితో నెలల తరబడి టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలకు ఎండ్ కార్డు పడ్డట్లు ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ సమస్యలు తొలిగించేలా చొరవ తీసుకున్న చిరంజీవిని అభినందిస్తూ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. స్వయంగా మహేష్, ప్రభాస్, రాజమౌళి కూడా చిరంజీవిని అభినందించారు. అయితే చిరు నేతృత్వంలో టాలీవుడ్ ప్రముఖులు జగన్ ని కలవడం పట్ల భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయి.
కేవలం కొందరిని మాత్రమే ఎందుకు పిలిచారు.. అందరిని ఎందుకు ఆహ్వానించలేదు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. జగన్ తో సన్నిహితంగా ఉండే నాగార్జున కూడా భేటీకి హాజరు కాలేదు. ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, మా అసోసియేషన్ నుంచి కానీ జగన్ తో భేటీకి అధికారికంగా ఎవ్వరూ వెళ్ళలేదు.
తాజాగా మాజీ మా ప్రెసిడెంట్ నరేష్ ట్వీటర్ వేదికగా జగన్, చిరు భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సీఎంతో భేటీ అభినందనీయం. కానీ ఏ భేటీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో అధికారికంగా, ఐకమత్యంగా జరిగి ఉండాల్సింది. టాలీవుడ్ సమస్యలని, వాటి పరిష్కారాలని ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్దతిలో, గౌరవంగా సమర్పించి ఉంటే బావుండేది. బహుశా ఇది త్వరలో జరుగుతుంది' అని ఆశిస్తున్నా అంటూ నరేష్ ట్వీట్ చేశారు.
నరేష్ వ్యాఖ్యల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ తో భేటీ టాలీవుడ్ నుంచి అధికారికంగా జరగలేదని నరేష్ అంటున్నారు.