
ప్రభుత్వ పాఠశాలకు కార్తి 5 లక్షలు విరాళం : కోయంబత్తూరు జిల్లా సూలూరులో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల వార్షికోత్సవ ఉత్సవాల్లో నటుడు శివకుమార్ పాల్గొన్నారు. ఆయన కూడా ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థే. ఆయనతో పాటు ఆయన రెండో కుమారుడు, నటుడు కార్తి, తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్, మాజీ మంత్రి సె.మ. వేలుస్వామి కూడా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఈ ఉత్సవాల్లో పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అలాగే ఈ పాఠశాలలో చదివి, వివిధ రంగాల్లో రాణిస్తున్న పూర్వ విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తి, విదేశీ పాఠశాలలతో పోలిస్తే మన ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు బాగా పెరిగాయని అన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులోనే ఉత్తమ విద్య అందుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఇప్పుడు రాణిస్తున్నారు. నాన్నగారు విద్యా క్రమశిక్షణతో జీవితంలో ఎదిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో 65 లక్షల మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 40 లక్షల మంది చదువుతున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలపైనే చాలా మంది ఆధారపడి ఉన్నారు.
తమిళనాడులో గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే ఆధారం. నా అత్త(శివకుమార్ సోదరి) చదువుకునే రోజుల్లో ఫీజు కట్టలేని పరిస్థితి. దాంతో ఆవిడ చాలా కష్టపడ్డారు అని చెబుతూ కార్తి కన్నీళ్లు పెట్టుకున్నారు.
శివకుమార్ ఆయన్ని ఓదార్చారు. తర్వాత సూలూరు ప్రభుత్వ పాఠశాలకు 5 లక్షల రూపాయలు విరాళం ఇస్తానని కార్తి ప్రకటించారు. దీనికి ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.