
ఇటీవల `మార్టిన్`, `కేడీ` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన యంగ్ హీరో ధ్రువ సర్జా ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు. కోట్ల రూపాయల మోసం ఆరోపణలతో ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాఘవేంద్ర హెగ్డే, ధ్రువ సర్జాపై ₹3.15 కోట్ల మోసం కేసులో FIR దాఖలు చేశారు.
రాఘవేంద్ర హెగ్డే ఇచ్చిన సమాచారం ప్రకారం, 2016లో తన మొదటి సినిమా విజయం తర్వాత ధ్రువ సర్జాతో కలిసి పనిచేయాలనుకున్నారు రాఘవేంద్ర హెగ్డే. 2016 నుండి 2018 వరకు దీనికి సంబంధించిన చర్చలు జరిగాయి. ‘ద సోల్జర్’ సినిమా స్క్రిప్ట్ ఇచ్చారు. సర్జా విజ్ఞప్తి మేరకు, హెగ్డే ఒప్పుకుని, ఒప్పందంపై సంతకం చేసే ముందు ₹3 కోట్లు ఇచ్చారు. ఈ డబ్బును ఫ్లాట్ కొనుగోలుకు వాడుకుంటానని సర్జా హామీ ఇచ్చారట.
హెగ్డే అధిక వడ్డీకి అప్పు తీసుకుని, తన నిర్మాణ సంస్థలైన RH ఎంటర్టైన్మెంట్, రూ9 ఎంటర్టైన్మెంట్ ద్వారా, వ్యక్తిగతంగా కలిపి మొత్తం ₹3.15 కోట్లను ఫిబ్రవరి 21, 2019 లోపు ధ్రువకి బదిలీ చేశారు. ఒప్పందం ప్రకారం సినిమా షూటింగ్ జనవరి 2020లో మొదలై జూన్ 2020లో పూర్తి కావాలి.
కానీ డబ్బు తీసుకున్న తర్వాత, సర్జా డేట్స్ వాయిదా వేస్తూ వచ్చారని, COVID-19 లాక్డౌన్ తర్వాత కూడా స్పందించలేదని హెగ్డే ఫిర్యాదులో ఆరోపించారు. స్క్రిప్ట్ రైటర్, పబ్లిసిటీ కన్సల్టెంట్లకు అదనపు చెల్లింపులు డిమాండ్ చేసి, మొత్తం ఖర్చును ₹3.43 కోట్లకు పెంచారు. చివరికి సర్జా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని, ఫోన్లకు సమాధానం ఇవ్వకుండా, మీటింగ్లకు రాకుండా, తాను ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పినట్టు హెగ్డే ఆరోపిస్తున్నారు.
హెగ్డే.. 2021లో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్కు వచ్చిన హైదరాబాద్కు చెందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉత్తరాన్ని ప్రస్తావించారు. అందులో సర్జా మరో ప్రాజెక్ట్కు డబ్బు తీసుకుని పనిచేయలేదని, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఉంది.
అంబోలి పోలీసులు హెగ్డే సమర్పించిన ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. 2018 నుంచి 18% వడ్డీతో మొత్తం నష్టం ₹9.58 కోట్లకు పైగా ఉందని తెలిపారు. దీంతో, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 316(2) (నేరపూర్వక విశ్వాస ఉల్లంఘన), 318(4) (మోసం, ఆస్తి బదిలీకి అప్రామాణిక ప్రేరణ) కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల ప్రకారం, ఫిర్యాదు అందిన తర్వాత API ప్రదీప్ ఫండే, సర్జాకు రెండుసార్లు సమన్లు పంపారు. హాజరుకాకుండా, సర్జా బెంగళూరు కోర్టు నుంచి 10 రోజుల ట్రాన్సిట్ బెయిల్ తీసుకుని, జూలై 30న దినోషి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 5న ₹50,000 పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు, కేసును ఆగస్టు 14, 2025 వరకు వాయిదా వేసింది.
సర్జా తరపు న్యాయవాది అషిమా మండ్లా, కేసు విచారణ దశలో ఉండటంతో స్పందించడానికి నిరాకరించి, తన క్లయింట్ నిబంధనల ప్రకారం సాక్ష్యాలు సమర్పిస్తారని తెలిపారు. అంబోలి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ ప్రమోద్ కుమార్ శ్రీరామ్ కోకటే స్పందిస్తూ, కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ధ్రవు సర్జా.. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కావడం విశేషం.