
నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' సినిమా రూపొంది, పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ద్వాపరయుగం నాటి ఒక సీక్రెట్ సంబంధించి ఈ కథ నడుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా కథ అంతా కూడా శ్రీకృష్ణుడు తిరుగాడిన ద్వారక .. మధుర .. బృందావనం .. గోవర్ధనగిరి వంటి క్షేత్రాలలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యినట్లు సమాచారం.
సెప్టెంబర్ 30,2022 నుంచి ఈ చిత్రం జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ మిస్టికల్ ట్రైలర్ ని వదులబోతున్నారు. ఈ మేరక త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాబోతోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 రోజులలో 120 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టడం విశేషం. కార్తికేయ 2 సినిమా మలయాళ వెర్షన్ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాలలో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన రెండో సినిమాగా కార్తికేయ 2 నిలిచింది. అంతేకాదు నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయంతో నిఖిల్ గాల్లో తేలిపోతున్నారు.
ఇప్పటికీ కూడా ఈ సినిమా 1000కి పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండటం విశేషం. ఈ సినిమా తరువాత ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు నార్త్ లోను చాలానే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఒక విశేషమైతే, ఇంకా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ఉండటం మరో విశేషం.