సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. తాజాగా అది మరోసారి బయటకు వచ్చింది.
గత కొంతకాలంగా తెలుగులో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ లు అయిన మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాత దిల్ రాజు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ ..ఈ యుద్దానికి వార్ గ్రౌండ్ గా మారింది. ఇది `హనుమాన్` చిత్రం రిలీజ్ తో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లింది. ఇప్పుడు మైత్రీ వాళ్లు మరో సారి డైరక్ట్ గానే దిల్ రాజు పై ఎటాక్ చేయబోతున్నారు. అయితే ఈ వార్ లో అనుకోకుండా విజయ్ దేవరకొండ ఇరుక్కున్నట్లు అయ్యింది. అదెలా అంటే...
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా `ఫ్యామిలీ స్టార్` దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గీత గోవిందం తర్వాత విజయ్- పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్ పై మంచి అంచనాలున్నాయి.
అయితే ఇదే రిలీజ్ డేట్ కు ఈ సినిమాకు పోటీగా మైత్రీ వారు.. మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రిలీజ్ ని తెస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ సినిమాలు భ్రమయుగం, ప్రేమలు(Premalu) సినిమాలు డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ అయ్యాయి. భ్రమయుగం తెలుగులో పర్వాలేదనిపించినా ప్రేమలు సినిమా మాత్రం భారీ విజయం సాధించింది. ఒక డబ్బింగ్ మలయాళం సినిమా ఏకంగా 15 కోట్లు తెలుగులో కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ప్రేమలు సినిమా తెలుగులో కూడా రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు మరో మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులోకి రాబోతుంది.
ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో ఏప్రిల్ 6న రిలీజ్ కాబోతుంది. ఇక్కడి సినిమా ప్రేమికులు కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క మంచి బజ్ ఉండటంతో ఫ్యామిలీ స్టార్ బిజినెస్ పై దిల్ రాజు బాగా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో బాగానే కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్- పరశురామ్ కాంబోలో వచ్చిన గీత గోవిందం వరల్డ్ వైడ్ గా రూ.65 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
ఇక మంజుమ్మల్ బాయ్స్ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 22న రిలీజయింది. కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్ కి వెళ్లగా, అక్కడ ఓ గుహలోకి ప్రవేశం లేకపోయినా వెళ్తారు. ఆ గుహ లోపల ఓ లోయలో ఒక ఫ్రెండ్ పడిపోతే మిగిలిన వాళ్లంతా అతన్ని ఎలా బయటకు తీశారు అనే థ్రిల్లర్, ఫ్రెండ్షిప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కగా ఇప్పటికే ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి మళయాళంలోనే ఇప్పటివరకు ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడీ రెండు సినిమాల మధ్య పోటీ అనివార్యంగా మారింది.