
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధవన్ తీవ్రంగా గాయపడి తాత్కాలికంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే అతడి గాయం ఇప్పట్లో తగ్గేలా కనపించకపోవడంతో తాజాగా టోర్నీ మొత్తానికి దూరమవ్వాల్సి వచ్చింది. భారత ప్రపంచ కప్ జట్టునుండి ధవన్ ను పక్కకు తప్పిస్తున్నట్లు తాజాగా టీం మేనేజ్ మెంట్ ప్రకటించింది.
అయితే ఈ విషయంపై శిఖర్ ధావన్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన గాయం గురించి, ప్రపంచ కప్ కు దూరమవ్వాల్సిన పరిస్థితుల గురించి ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్ వేదికన దాన్ని పోస్ట్ చేశాడు. '' ప్రపంచ కప్ 2019 కు దూరమవుతున్నానని ప్రకటించాలంటే చాలా భాదగా వుంది. కానీ దురదృష్టవశాత్తు నా బొటనవేలి గాయం ఇంకా తగ్గలేదు. అయితే నేను లేకపోయినా టీమిండియా విజయపరంపర కొనసాగుతుంది. ఇప్పటివరకు నాకు అండగా నిలిచచి మీ ప్రేమను అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, క్రికెట్ ప్రియులు, దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు. జై హింద్'' అంటూ ధవన్ ట్వీట్ చేశాడు.
ధవన్ అధికారంగా భారత జట్టుకు దూరమవడంతో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చాడు. ప్రపంచ కప్ కు ఎంపికైన 15 మందితో కూడిన టీమిండియా బృందం నుండి ధవన్ వైదొలగడంతో పంత్ జట్టులోకి చేరినట్లు టీమ్ మేనేజర్ సునీల్ సుబ్రహ్మణం వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధవన్ సెంచరీతో అదరగొట్టి ఫామ్ లోకి రావడంతో అభిమానులు ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. సెంచరీ చేసే క్రమంలోనే కమిన్స్ బౌలింగ్లో వేగంగా వచ్చిన ఓ బంతిని ఆడబోయిన ధవన్ కు గాయమైంది. బంతి నేరుగా బొటనవేలికి తాకడంతో తీవ్ర గాయమైంది. ఈ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు రెస్ట్ సూచించడంతో మూడు మ్యాచుల పాటు అతడు భారత జట్టుకు దూరమవనున్నట్లు ప్రకటించారు. తాజాగా గాయం తీవ్రత తగ్గకపోవడంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు.
2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల