లాల్‌చంద్‌ను పాక్‌ టూర్ నుంచి తప్పించిన భారత్‌: భగ్గుమన్న పాకిస్తాన్

By Siva KodatiFirst Published Oct 21, 2020, 8:37 PM IST
Highlights

భారత్‌ మాజీ క్రికెటర్, జింబాబ్వే హెడ్‌ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పాకిస్తాన్‌ పర్యటన నుంచి తప్పుకున్నారు. హరారేలోని భారత రాయబార కార్యాలయం 58 ఏళ్ల రాజ్‌పుత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరడంతో జింబాబ్వే ప్రభుత్వం అంగీకరించింది

భారత్‌ మాజీ క్రికెటర్, జింబాబ్వే హెడ్‌ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పాకిస్తాన్‌ పర్యటన నుంచి తప్పుకున్నారు. హరారేలోని భారత రాయబార కార్యాలయం 58 ఏళ్ల రాజ్‌పుత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరడంతో జింబాబ్వే ప్రభుత్వం అంగీకరించింది.

దీంతో ఆయన జింబాబ్వే జట్టుతో కలిసి పాక్‌ పర్యటనకు వెళ్లలేదు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ట్విట్టర్‌లో వెల్లడించింది. లాల్‌చంద్‌కు హరారేలోని పాకిస్తాన్‌ రాయబార కార్యాలయం వీసా జారీ చేసింది.

అయితే భారత్‌ ఆయన్ని టూర్‌ నుంచి తప్పించాలని కోరింది. దీంతో ఆయన జట్టుతో పాటు పాక్‌కు బయలుదేరలేదు’ అని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ట్వీట్‌ చేసింది. దీంతో బౌలింగ్‌ కోచ్‌ డగ్లస్‌ హోండోకు తాత్కాలికంగా హెడ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పగించింది.

భారత్‌ తీరుపై పాక్‌ క్రికెట్‌ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. జట్టుతో పాటు ఆయనకు అసాధారణ భద్రత ఏర్పాట్లు చేశామని... వీసా జారీ చేశాక కూడా రాజ్‌పుత్‌ను నిలువరించడం అర్థం లేని చర్యని పీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

మూడు వన్డేలు, మూడు టీ 20లు ఆడేందుకు జింబాబ్వే జట్టు మంగళవారం పాకిస్తాన్‌కు చేరుకుంది. క్వారంటైన్, కోవిడ్‌ టెస్టులు ముగిశాక రావల్పిండిలో ఈ నెల 30, నవంబర్‌ 1, 3 తేదీల్లో మూడు వన్డేలు అనంతరం లాహోర్‌లో 7, 8, 10 తేదీల్లో మూడు టి20లు ఆడుతుంది. కాగా జింబాబ్వే జట్టు చివరిసారిగా 2015లో చివరిసారిగా పాక్‌ పర్యటనకు వెళ్లింది.

click me!