
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎదురులేకుండా దూసుకుపోతోంది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాలు అందుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై 143 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న ముంబై ఇండియన్స్ తర్వాతి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 9 వికెట్ల తేడాతో గెలిచింది...
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ సాధించిన ముంబై ఇండియన్స్, తాజాగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని... వరుసగా నాలుగో విజయం అందుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ప్రతీ జట్టుపై విజయం అందుకున్న మొదటి జట్టు ముంబై ఇండియన్స్..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్ టీమ్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఆలీసా హీలి 46 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్తో 58 పరుగులు చేయగా దేవికా వైద్య 5 బంతుల్లో ఓ ఫోర్తో 6 పరుగులు, కిరణ్ నవ్గైర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరారు....
తహిళా మెక్గ్రాత్ 37 బంతుల్లో 9 ఫోర్లతో 50 పరుగులు చేయగా ఎల్లీస్టోన్ 4 బంతుల్లో 1 పరుగు, దీప్తి శర్మ 6 బంతుల్లో ఓ ఫోర్తో 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇషకీ 3 వికెట్లు తీయగా అమీలియా కేర్కి 2 వికెట్లు దక్కాయి...
160 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది ముంబై ఇండియన్స్. హేలీ మాథ్యూస్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి ఎల్లీస్టోన్ బౌలింగ్లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుటైంది. యషికా భాటికా 27 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్తో 42 పరుగులు చేయగా నట్ సివర్ బ్రంట్ 31 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 45 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 53 పరుగులు చేసి మ్యాచ్ ముగించారు...
ఈ ఇద్దరూ మూడో వికెట్కి 106 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. వరుసగా మొదటి నాలుగు మ్యాచుల్లోనూ టాస్ ఓడిపోయిన హర్మన్ప్రీత్ కౌర్, నాలుగు మ్యాచుల్లోనూ విజయాలు అందుకుంది. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు చేసి, రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచింది..
ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోనీ, జార్జ్ బెయిలీ (2014లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్) వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలవగా, డబ్ల్యూపీఎల్లో ఆ ఫీట్ హర్మన్ప్రీత్ కౌర్ సాధించింది.