
ముంబై వేదికగా ఈనెల 4 న ఆరంభమై క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తుది అంకానికి చేరింది. ఐదు జట్లు పాల్గొన్న తొలి సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ లు తుదిపోరుకు అర్హత సాధించాయి. నేడు బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న డబ్ల్యూపీఎల్ ఫైనల్స్ లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయనుంది.
ఈ లీగ్ లో తొలుత ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ గెలిచిన ముంబై తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడి నేరుగా ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయి యూపీ వారియర్స్ తో ప్లేఆఫ్స్ ఆడిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్ లో యూపీని చిత్తుగా ఓడించిన ముంబై.. నేడు ఢిల్లీ పైనా అదే ఆటతీరుతో ద అదరగొట్టాలని భావిస్తున్నది.
బ్యాటింగ్ లో యస్తికా, హేలీ మాథ్యూస్, సీవర్, కెర్ లు గత మ్యాచ్ లో రాణించారు. వీళ్లతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కూడా రాణిస్తే ఢిల్లీకి కష్టాలు తప్పవు. సీవర్ తో పాటు వస్త్రకార్, కెర్ కూడా ఆల్ రౌండర్ పాత్రను సమర్థవంతంగా పోషిస్తుండటం ముంబైకి మేలు చేసేదే. ఇక గత మ్యాచ్ లో హ్యాట్రిక్ తో రెచ్చిపోయిన ఇసీ వాంగ్ కు తోడు స్పిన్నర్ సైకా ఇషాక్ లు చెలరేగితే ఢిల్లీకి చుక్కలే.
అలా అని ఢిల్లీని ఈజీగా తీసేయడానికి లేదు. టోర్నీలో ఆది నుంచీ అగ్రెసివ్ ఆటతో రెచ్చిపోతున్న టీమ్ లలో ముంబై తర్వాత ఢిల్లీ ఉంది. టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న మెగ్ లానింగ్ ఢిల్లీకి బలం. ఆమెతో పాటు డ్యాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ లు ఈ లీగ్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరి తర్వాత మరియనె కాప్, అలీస్ క్యాప్సీ లు కూడా ధాటిగా ఆడేవాళ్లే. జెమీమా రోడ్రిగ్స్, జొనాసేన్, తాన్యా భాటియాలతో ఢిల్లీ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. బౌలింగ్ లో కాప్, తారా నోరిస్, అరుంధతి, రాధా యాదవ్, శిఖా పాండే లను అడ్డుకోవడం ముంబైకి సవాలే.. మరి ఈ లీగ్ లో తొలి ట్రోఫీ అందుకునేది ఎవరో..?
తుది జట్లు : ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో పూనమ్ యాదవ్ స్థానంలో మిన్ను మని తుది జట్టులోకి రాబోతుంది. ముంబై జట్టులో మార్పులేమీ లేవు.
ముంబై : యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, పూజా వస్త్రకార్, ఇసీ వాంగ్, అమన్జ్యోత్ కౌర్, హుమైరా కాజి, జింతమణి కలిత, సైకా ఇషాక్
ఢిల్లీ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మరియనె కాప్, అలీస్ క్యాప్సీ, జెస్ జొనాసేన్, అరుంధతి రెడ్డి, తాన్యా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే, మిన్ను మణి