
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలై వారం రోజులు గడుస్తోంది. ఈ ఏడు రోజుల్లో ఆర్సీబీ నాలుగు మ్యాచ్ లు ఆడింది. క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి. టీమ్ లో ప్లేయర్లూ వస్తూ పోతున్నారు. ప్రత్యర్థులు మారుతున్నారు. అయినా ఆర్సీబీ రాత మాత్రం మారడం లేదు.ఈ సీజన్ లో ఆ జట్టు పేలవమైన ఆటతో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్య ఛేదనలో యూపీ.. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా మరో 7 ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో యూపీ ఇన్నింగ్స్ ను కెప్టెన్ అలీస్సా హీలి (47 బంతుల్లో 96 నాటౌట్, 18 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆరంభించింది. శ్రేయాంక వేసిన రెండో ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన ఆమె.. కొమల్ జంజద్ వేసిన మూడో ఓవర్లో కూడా అదే సీన్ రిపీట్ చేసింది. శ్రేయాంక వేసిన ఆరో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడింది.
తొలి పవర్ ప్లే లోనే యూపీ స్కోరు అర్థ సెంచరీ (55-0) దాటింది. మరో ఓపెనర్ దేవికా వైద్య (31 బంతుల్లో 36 నాటౌట్, 5 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా హీలి మాత్రం ఆర్సీబీ బౌలర్లను ఆటాడుకుంది. రేణుకా సింగ్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసిన హీలి.. ఈ సీజన్ తో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకుంది. ఆ ఓవర్లో తర్వతి నాలుగు బంతులను బౌండరీకి తరలించింది. పది ఓవర్లు ముగిసేసరికే యూపీ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది.
ఇక బర్న్స్ వేసిన 11వ ఓవర్లో హీలి.. 4, 6 తో విజయానికి చేరువైంది. ఎలీస్ పెర్రీ వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లు బాదడంతో యూపీ స్కోరు 120లలోకి చేరింది. శ్రేయాంక వేసిన 13వ ఓవర్లో వైద్య, హీలిలు తలా ఫోర్ కొట్టి యూపీకి విజయాన్ని ఖాయం చేశారు.
డబ్ల్యూపీఎల్ లో ఒక జట్టు వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే ప్రథమం. 139 పరుగుల లక్ష్యాన్ని యూపీ.. ఓపెనర్లే దంచేయడం గమనార్హం.
అంతకముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు మరోసారి తీవ్ర నిరాశపరిచారు. ఎలీస్ పెర్రీ (52), సోఫీ డివైన్ (36) మినహా మిగిలినవారంతా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. కెప్టెన్ స్మృతి మంధాన (4), కనిక అహుజా (8), హెదర్ నైట్ (2), శ్రేయాంక పాటిల్ (15), ఎరిన్ బర్న్స్ (12), రిచా ఘోష్ (1) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. యూపీ బౌలర్లలో ఎక్లిస్టోన్ నాలుగు వికెట్లు తీయగా దీప్తి శర్మకు మూడు వికెట్లు దక్కాయి.