
భారత్ తో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు గత కొంతకాలంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ నేటి నుంచే మొదలుకానుంది. ముంబై లోని డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగబోయే తొలి సీజన్ లో ఐదు జట్లు ఢీకొనబోతున్నాయి. తొలి మ్యాచ్ ముంబై - గుజరాత్ మధ్య నేటి రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. మార్చి 4 నుంచి 26 వరకు సాగే ఈ మెగా సీజన్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ కు సంబంధించిన పూర్తి వివరాలివిగో..
ఐదు జట్లు పాల్గొంటున్న తొలి సీజన్ కు ముందు గత నెలలో ముగిసిన వేలంలో సుమారు 400 మంది ప్లేయర్లు పాల్గొంటే వారిలో 87 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే.
ఐదు జట్లు - కెప్టెన్లు :
- ముంబై ఇండియన్స్ : హర్మన్ప్రీత్ కౌర్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన
- యూపీ వారియర్స్ : అలీస్సా హీలి
- గుజరాత్ జెయింట్స్ : బెత్ మూనీ
- ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్
ఫార్మాట్ ఇలా.. :
నేటి నుంచి మొదలుకాబోయే ఈ సీజన్ లో మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్ లు ఆడతాయి. 18 రోజుల్లో ప్రతీ జట్టు.. తమ ప్రత్యర్థి టీమ్ తో రెండు మ్యాచ్ (డబుల్ రౌండ్ రాబిన్) లు ఆడుతుంది. లీగ్ దశలో ప్రతీ జట్టు రెండు మ్యాచ్ లు ఆడగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న టీమ్ లు ఫైనల్ లో పాల్గొనబోయే రెండో జట్టు కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి.
చూడటమిలా.. :
డబ్ల్యూపీఎల్ మీడియా, డిజిటల్ హక్కులను వయాకామ్ 18 (జియో) దక్కించుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి జరుగబోయే మ్యాచ్ లన్నీ టెలివిజన్ లో అయితే స్పోర్ట్స్ 18 ఛానెల్ లో చూడవచ్చు. అదే యాప్ లో చూడాలనుకుంటే జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారాలుంటాయి. ప్రస్తుతానికి జియో సినిమా యాప్ లో రుసుములేమీ చెల్లించకుండానే ఉచితంగానే మ్యాచ్ లను వీక్షించొచ్చు.
ఆరంభం అదిరేలా.. :
డబ్ల్యూపీఎల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ.. ఆరంభం అదిరిపోయేలా ప్లాన్ చేసింది. ముంబై - గుజరాత్ మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందే బాలీవుడ్ తారలు కృతి సనన్, కియారా అధ్వానీల ప్రదర్శన ఉండనుంది. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, ర్యాపర్ ఏపీ దిల్లాన్ డబ్ల్యూపీఎల్ నేపథ్య గాయంతో పాటు బాలీవుడ్ పాటలతో అలరించనున్నారు.
మహిళలకు ఉచితంగానే..
తొలి సీజన్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు గాను టికెట్ రేట్లను రూ. 100, రూ. 400 గా నిర్ణయించింది. ఇక అమ్మాయిలు, మహిళలు, బాలికలైతే మ్యాచ్ ఉచితంగానే చూడొచ్చు.
ఐదు ఫ్రాంచైజీల పూర్తి జట్లు :
1. గుజరాత్ జెయింట్స్ : ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, సోఫి డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, హర్లీన్ డియోల్, డాటిన్, స్నేహ్ రాణా, సబ్బినేని మేఘన, జార్జియా వెర్హమ్, మన్షీ జోషి, హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, షబ్నమ్ షకీల్, సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరుణిక సిసోడియా
2. బెంగళూరు : స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా, డేన్ వన్ నీకర్క్, పూనమ్ ఖేమ్నర్, అశ్విన్ కుమారి, ప్రీతి బోస్, హెథర్ నైట్, మేగన్ షూట్, సహనా పవార్
3. ముంబై : హర్మన్ప్రీత్ కౌర్, నటాలీ స్కీవర్, అమిలియా కేర్, పూజా వస్త్రకార్, యస్తికా భాటియా, హీథర్ గ్రాహమ్, ఇసాబెల్లె వాంగ్, అమన్జ్యోత్ కౌర్, ధారా గుజ్జర్, సయికా ఇషాక్, హీలి మాథ్యూస్, హుమైరా కాజి, ప్రియాంక బాలా, చోల్ టైరన్, సోనమ్ యాదవ్, జింతిమని కలిత, నీలం బిష్త్
4. ఢిల్లీ : జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, మరిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, తితాస్ సాధు, అలీస్ క్యాప్సీ, తారా నొరిస్, లారా హరీస్, మిన్ను మని, జైసా అక్తర్, అపర్ణా మండల్, స్నేహ్ దీప్తి, పూనమ్ యాదవ్, తాన్యా భాటియా, జెస్ జొనాసేన్, అరుందతి రెడ్డి
5. యూపీ : సోఫియా ఎక్లిస్టోన్, షబ్నమ్ ఇస్మాయిల్, తహిలా మెక్గ్రాత్, దీప్తి శర్మ, ఎలీస్సా హీలి, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్, పర్శవి చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, కిరణ్ నవ్గిరె, గ్రేస్ హరీస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, సిమ్రాన్ షేక్