Virat Kohli emotional statement: ఐపీఎల్ 2025 టైటిల్ను విజయవంతంగా గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సంబరాల్లో మునిగిపోయింది. ఈ చారిత్రాత్మక విజయంపై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో కన్నీళ్లు తెచ్చుకున్న కోహ్లి.. “నా హృదయం, నా ఆత్మ అన్నీ బెంగళూరుతోనే అనుబంధంగా ఉన్నాయి. నేను ఎప్పుడు ఐపీఎల్ ఆడుతున్నా, ఆర్సీబీ కోసమే ఆడతాను” అని చెప్పారు.
“నా నమ్మకాన్ని ఎప్పుడూ మార్చలేదు.. ఇతరులు కొత్త జట్లకు మారినా, నేను మాత్రం ఆర్సీబీకి నా విధేయతగా ఉన్నాను. ఏ క్షణామైనా మిగిలిన జట్లకు వెళ్లే ఆలోచన వచ్చినా, నా హృదయం మాత్రం ఎప్పుడూ బెంగళూరుతోనే ఉంది. ఈ రోజు నేను బేబీలా నిద్రపోతాను. ఇది బెంగళూరు అభిమానుల గెలుపు” అని కోహ్లి పేర్కొన్నారు.
“ఆర్సీబీ జట్టు ఎప్పుడూ ట్రోఫీని గెలవలేదు. కాబట్టి వేరే జట్టుకు వెళ్లాలనే ఆలోచన వచ్చిందన్నది అబద్ధం కాదు. కానీ నేను ఆర్సీబీలోనే భాగంగా కొనసాగాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. నా మనస్సు, హృదయం, ఆత్మ బెంగళూరుతో ముడిపడి ఉన్నాయని” కోహ్లీ అన్నాడు.
కోహ్లి మాట్లాడుతూ “ఈ టైటిల్ కోసం అభిమానులు 18 సంవత్సరాలుగా ఎదురు చూశారు. మా జట్టు ఓడినప్పుడల్లా వాళ్లు మమ్మల్ని వెనక నుంచి తట్టి ప్రోత్సహించారు. ఎక్కడ ఆడినా వారు మాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ల కల నిజమైంది” అని అన్నారు.
ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలిచిన తర్వాత విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్తో కలిసి 'ఈ సలా కప్ నామ్దే' (ఈసారి కప్ మనదే) అని ఉల్లాసంగా నినదిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆర్సీబీ అభిమానుల నినాదంగా ఇది మరింతగా మారు మోగుతోంది.
ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగింది. విరాట్ కోహ్లి (43), మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, రోమారియో షెపర్డ్ అందరూ కలిసి ఆడటంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యష్ దయాల్, రోమారియో షెపర్డ్ బౌలింగ్ ధాటికి పంజాబ్ 184 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఆర్సీబీ మొదటి సారి ఐపీఎల్ ట్రోఫీ అందుకోవడంతో, అభిమానులంతా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.