
వెస్టిండీస్ టూర్లో జరిగిన తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన భారత జట్టు, జూలై 20 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్కి ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
‘డొమినికాలో పిచ్ చూశాం. ఎలా ఆడాలో అర్థమైంది. అందుకే క్లియర్ ఐడియాతో బ్యాటింగ్ చేశాం. కాస్త తొందరపడితే వికెట్ పోతుందని తెలుసు. రెండో టెస్టులోనూ ఇదే కొనసాగిస్తాం. రెండో టెస్టులో భారీ మార్పులైతే ఏమీ ఉండవు. పరిస్థితులను బట్టి అవసరమైన ఒకటి, రెండు మార్పులను చేస్తాం...
కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చేందుకు సీనియర్లు కూర్చోవాల్సి ఉంటుంది. కుర్రాళ్లు బాగా ఆడుతుంటే వారి కోసం పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. మార్పు, ప్రవాహం జరుగుతూనే ఉండాలి. ఇవ్వాళ కాకపోతే రేపు నా ప్లేస్లో ఇంకో ప్లేయర్ వస్తాడు..
టీమ్లోకి వస్తున్న కొత్త కుర్రాళ్లు బాగా ఆడుతుండడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. వారి రోల్ గురించి వారికి క్లియర్గా వివరిస్తున్నాం. ఆ రోల్లో తమని తాము నిరూపించుకోవాల్సిన బాధ్యత వారి చేతుల్లోనే ఉంటుంది. టీమిండియా భవిష్యత్తు వాళ్లే..
కుర్రాళ్ల ఆటతీరు చూస్తుంటే భవిష్యత్తులో భారత జట్టును మరింత ఎత్తులో నిలబెడతారని నమ్మకం కలుగుతోంది. వెస్టిండీస టీమ్కి ఘనమైన చరిత్ర ఉంది. వారి జట్టులో మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు. కమ్బ్యాక్ ఇవ్వడం వారికి పెద్ద కష్టమేమీ కాదు.. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
తొలి టెస్టులో జయ్దేవ్ ఉనద్కట్, రెండు ఇన్నింగ్స్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన జయ్దేవ్ ఉనద్కట్, రెండో ఇన్నింగ్స్లో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ఓ మెయిడిన్ ఓవర్ వేసిన జయ్దేవ్ ఉనద్కట్కి రెండో టెస్టులో చోటు దక్కకపోవచ్చని టాక్ వినబడుతోంది..
జయ్దేవ్ ఉనద్కట్ ప్లేస్లో రెండో టెస్టులో ముకేశ్ కుమార్ ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది. తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 12 వికెట్లు తీస్తే, రవీంద్ర జడేజాకి 5 వికెట్లు దక్కాయి. భారత ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీస్తే శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశాడు..
స్పిన్నర్లకు ఎక్కువ వికెట్లు దక్కడంతో జయ్దేవ్ ఉనద్కట్ ప్లేస్లో అక్షర్ పటేల్ని ఆడించే అవకాశం కూడా ఉంది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులోకి ఎంట్రీ ఇస్తే, రెండో టెస్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతుంది టీమిండియా..