
2011 ఏప్రిల్ 2. ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియం వేదికగా వన్డే ప్రపంచకప్ ఫైనల్. భారత్ విజయానికి అత్యంత చేరువలో ఉంది. లంక బౌలర్ కులశేఖర బంతి విసిరాడు. క్రీజులో ధోని. బాల్ పడింది. మహేంద్రుడు భారీ హిట్టింగ్ తో బంతి గాల్లోకి లేచింది. స్టేడియంలో ఉన్నవారంతా బంతి గమనాన్ని చూస్తున్నారు. టీవీల ముందు చూస్తున్న అభిమానులకు మాత్రం ధోని షాట్ తో పాటు బిగ్గరగా ఒక వాయిస్ వినబడింది. ‘ధోని.. ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఎ మెగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇంటు ద క్రౌడ్.. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఈయర్స్. ద పార్టీ బిగిన్స్ ఇన్ డ్రెస్సింగ్ రూమ్...’.
ధోని విన్నింగ్ సిక్సర్ కంటే బలంగా వినిపించింది ఆ శబ్దం. ఆ వాయిస్ భారత మాజీ సారథి రవిశాస్త్రిది. భారత విజయాన్ని ధోని ఖరారు చేస్తే.. ఆ విజయం దక్కి పదకొండేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ మూమెంట్ ను శాస్త్రి కామెంట్రీ లేకుంటే వినడమంటే అది మూకీ సినిమా చూడటం వంటిదే అంటుంటారు క్రికెట్ అభిమానులు. ఆ నాలుగు వ్యాఖ్యలకు కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి..
భారత్ రెండో వన్డే ప్రపంచకప్ గెలిచి 11 ఏండ్లు పూర్తైన సందర్భంగా రవిశాస్త్రి తిరిగి అదే వాయిస్ ను రిక్రియేట్ చేశాడు. అప్పుడు అతను చెప్పిన నాలుగు మాటలే.. చాలా కాలం పాటు క్రికెట్ ప్రేమికుల రింగ్ టోన్ గా మారిన ఆ నాలుగు మాటలను శాస్త్రి మళ్లీ చెప్పాడు. అయితే ఈసారి హిందీలో..
ఐపీఎల్-2022 సందర్భంగా హిందీ వ్యాఖ్యానం అందిస్తున్న శాస్త్రి.. ఈ మ్యాజిక్ ను మళ్లీ క్రియేట్ చేశాడు. హర్భజన్ సింగ్ తో పాటు శాస్త్రి.. కామెంట్రీని హిందీ లో చెప్పాడు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా భజ్జీ ఈ మ్యాజిక్ మూమెంట్స్ కు కామెంట్రీ చెబుతూ.. ‘సచిన్ టెండూల్కర్ కు ప్రపంచకప్ గెలవాలనే కల ఉండేది. ఇప్పుడది నెరవేరింది. ఆటగాళ్లు భావోద్వేగంతో ఉన్నారు. టీమిండియా క్రికెట్ కు ఇది బిగ్ మూమెంట్...’ అని హిందీలో వ్యాఖ్యానించాడు. కాగా 2011 ప్రపంచకప్ జట్టులో భజ్జీ కూడా సభ్యుడు.
1983 లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు విండీస్ ను ఓడించి ప్రపంచకప్ నెగ్గిన తర్వాత 28 ఏండ్లకు ధోని నాయకత్వంలోని భారత జట్టు.. శ్రీలంకను ఓడించి ప్రపంచకప్ ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చింది. ఇక ప్రపంచకప్ గెలిచి 11 ఏండ్లు గడిచిన సందర్బంగా అప్పటి జట్టు సభ్యులు విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, గౌతం గంభీర్ లు ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.