
ఓటమిలో ఉన్నవాడికి ఓదార్పు కంటే కావల్సింది స్ఫూర్తి. ఓ వ్యక్తి కుంగిపోకుండా.. తన కాళ్ల మీద తాను నిలబడేలా వారిలో ప్రేరణ రగిలించాలి. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా క్రీడల్లో అయితే ఒక ఆటగాడు ఓడిపోతే ఏడుస్తూ కూర్చుంటే అతడెప్పుడూ విజయం సాధించలేడు. అతడిలో స్ఫూర్తి రగలాలి. ‘నేను సాధించగలను..’ అనే ప్రేరణ ఆ ఆటగాడిలో కలిగిస్తే ఫలితాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఆ స్ఫూర్తి ఎదుటివారు కలిగించేది అయినా, మనకు మనం స్వంతగా మోటివేట్ చేసుకునేదానికైనా సరే.. మన సంకల్పాన్ని నెరవేర్చే దిశగా అది తోడ్పడితే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ లో అదే స్ఫూర్తి రగిలించాడు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే. ఆటగాళ్లకు విజయకాంక్షను రగిల్చే సినిమా ఒకటి చూపించి వారిలో టోర్నీ గెలవాలనే కోరికను బలంగా నాటాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? అందులో అంతలా ప్రేరణ కలిగించే అంశాలేమున్నాయి..?
నేపాలీ పర్వాతారోహకుడు నిర్మల్ పుజారా, అతడి బృందానికి చెందిన కథే ‘14 పీక్స్’, నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అనేది ట్యాగ్ లైన్. టూకీగా చెప్పాలంటే.. ఏడు నెలల్లో 14 పర్వతాలను అదిరోహించాలనే దృఢ సంకల్పంతో ఉన్న బృంధాన్ని ఎంచుకుని ఒక్కో అవరోధాన్ని దాటుకుంటూ వారి గమ్యాన్ని ఎలా చేరుకున్నారనేది కథ. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు టార్కిల్ జోన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2021లో ఈ సినిమా విడుదలైంది.
నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాను పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు చూపించాడు కుంబ్లే. ఇటీవలే తమకు కేటాయించిన హోటల్ కు వచ్చిన క్రికెటర్లందరి కోసం ప్రత్యేకంగా ఓ షో కూడా వేయించాడు. వాళ్లందరూ ‘14 పీక్స్’ ను ఎంతో ఆసక్తిగా చూశారని ఆ జట్టు ఆటగాడు ఓడియన్ స్మిత్ తెలిపాడు. భానుక రాజపక్స కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
14 పీక్స్ సినిమాలో హీరో బృందం.. 14 పర్వతాలను అదిరోహించినట్టే తమ జట్టు కూడా ఐపీఎల్-2022 లో లీగ్ దశలో ఉన్న 14 అవరోధాల (మ్యాచులు) లను దాటుకుని ప్లేఆఫ్స్ చేరడమే గాక ట్రోఫీ కూడా సాధించాలని కుంబ్లే వాళ్లకు సూచించినట్టు స్మిత్ వెల్లడించాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ తొలి అవరోధాన్ని (ఆర్సీబీతో మ్యాచ్) ను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. మిగిలిన 13 మ్యాచులను కూడా దాటి ప్లేఆఫ్స్ చేరడమే గాక ట్రోఫీని గెలుచుకుంటామనే విశ్వాసంతో ఉన్నట్టు స్మిత్ వెల్లడించాడు.
స్మిత్ చెప్పినట్టు తొలి అవరోధాన్ని పంజాబ్ విజయవంతంగా దాటిన విషయం తెలిసిందే. ఆర్సీబీ నిలిపిన కొండంత లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలుండగానే ఊదేసింది. శిఖర్ ధావన్ (43), భానుక రాజపక్స (43), మయాంక్ అగర్వాల్ (32) ల ఆటకు తోడు ఆఖర్లో ఒడియన్ స్మిత్.. 8 బంతుల్లో 25 పరుగులు చేశాడు. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో పూనకం వచ్చినట్టు ఆడాడు. ఆ ఓవర్లో ఏకంగా 3 సిక్సర్లు, ఓ ఫోర్ సాయంతో 25 పరుగులు రాబట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. ఫలితంగా పంజాబ్ కు ఈ సీజన్ లో సూపర్ విక్టరీని అందించాడు.