
ఐపీఎల్ లో గత సీజన్ వరకు ఒకే ఫ్రాంచైజీలో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు.. ఆటగాళ్లు అనే కంటే సొంత అన్నదమ్ములు అంటే బెటరేమో... వాళ్లిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు. ఇంటి నుంచి ఒకే కార్లో బయలుదేరినా గ్రౌండ్ లోకి వచ్చేసరికి మాత్రం వారి దారులు వేరయ్యాయి. ఒకరు గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ అయ్యాడు. మరొకడు లక్నోసూపర్ జెయింట్స్ కు స్టార్ స్పిన్నర్ అయ్యాడు. ఆ ఇద్దరే హార్థిక్ పాండ్యా.. అతడి సోదరుడు కృనాల్ పాండ్యా. సోమవారం వాంఖెడే వేదికగా జరిగిన మ్యాచులో వీళ్లిద్దరూ ఎదురుపడినప్పుడు స్టేడియంలో ఓ హైడ్రామా నడిచింది.
నిన్నటి మ్యాచులో లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. అయితే ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన హార్థిక్ పాండ్యా (33).. మాథ్యూ వేడ్ (30) తో కలిసి ఇన్నింగ్స్ ను సరిదిద్దే పనికి దిగాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు మూడో వికెట్ కు 57 పరుగులు జోడించారు.
అయితే దూకుడుగా ఆడుతున్న హార్థిక్ ను ఔట్ చేయకుంటే మ్యాచ్ దక్కేలా లేదని ఎల్ఎస్జీ సారథి కెఎల్ రాహుల్.. తన స్పిన్నర్ కృనాల్ పాండ్యా కు బంతిని అందించాడు. తన అన్న వేసిన పదో ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడిన తమ్ముడు హార్థిక్.. మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఎంత చిన్న బ్యాటర్ అయినా ఒక బౌలర్ వికెట్ తీశాక తప్పకుండా సంతోషపడతాడు. వికెట్ పడ్డ ఆనందంలో వేడుక చేసుకుంటాడు. కానీ కృనాల్ మాత్రం నోటికి చేయి అడ్డం పెట్టుకుని.. ‘అయ్యో.. నా తమ్ముడిని ఔట్ చేశానే..’ అన్నట్టుగా మిన్నకుండి పోయాడు.
ఇక మ్యాచ్ అనంతరం హార్థిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘కృనాల్ నన్ను ఔట్ చేశాడు. అయితే నేను మాత్రం మ్యాచ్ గెలిచాను. మొత్తంగా మా కుటుంబం అయితే మాత్రం ఫుల్ హ్యాపీ..’ అని చమత్కరించాడు. అయితే ఇదే విషయమై కృనాల్ పాండ్యా స్పందిస్తూ.. తన తమ్ముడిని ఔట్ చేయడం కొంచెం బాధగా అనిపించిందని చెప్పడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ క్లాసిక్ ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాలో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ ల బ్రొమాన్స్ లా అనిపించడం లేదు. ఇది చూసిన ఇరు జట్ల క్రికెట్ ఫ్యాన్స్.. అంతేమరి, ఎంత క్రికెట్ అయినా బంధాల విషయంలో ఎమోషన్లు ఎక్కడికి పోతాయి అని అనుకుంటున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖెడే లో జరిగిన మ్యాచులో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న జీటీ.. లక్నోను 158 పరుగులకే కట్టడి చేసింది. రూ. 17 కోట్లు పెట్టి దక్కించుకున్న ఆ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ ఎదుర్కున్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అయితే ఆల్ రౌండర్లు దీపక్ హుడా (55), కృనాల్ పాండ్యా (21) లతో పాటు యువ ఆటగాడు అయుష్ బదోని (54) రాణించడంతో లక్నో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ తరఫున వేడ్ (30), హార్థిక్ (33), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాటియా (40) రాణించడంతో జీటీ విజయం సాధించింది.