
ఐపీఎల్ ప్రారంభమై నాలుగు వారాలు కావస్తున్నది. ఇప్పటివరకు 31 మ్యాచులు విజయవంతంగా జరిగాయి. హై స్కోరింగ్ గేమ్ లతో పాటు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన లో స్కోరింగ్ గేమ్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాంప్ లో చేరిన అనుకోని అతిథి (కరోనా).. ఆ జట్టును కలవరపరుస్తున్నది. ఆ అతిథి రాకూడదని బీసీసీఐ తో పాటు ఐపీఎల్ నిర్వాహకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏకంగా ఢిల్లీ క్యాపిట్సల్స్ ఫిజియోను తాకి మెల్లగా ఆటగాళ్లకు కూడా పాకింది. కరోనా కారణంగా అసలు మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అని సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లు దూరమైనా మిగిలిన వారంతా ఫిట్ గా ఉండటంతో మ్యాచ్ నిర్వహణకే ఐపీఎల్ నిర్వాహకులు మొగ్గు చూపారు.
ఆసక్తి రేపుతున్న ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ట్రెండ్ ను ఫాలో అయింది. రిషభ్ సేన బౌలింగ్ చేయనుండగా.. పంజాబ్ బ్యాటింగ్ కు రానుంది. కోవిడ్ కారణంగా పూణే నుంచి ముంబైలోని బ్రబోర్న్ స్టేడియానికి ఈ మ్యాచ్ ను షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు ఢిల్లీ ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచుల్లో రెండింటిలో గెలిచి మూడు మ్యాచులలో ఓడి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ విషయానికొస్తే.. ఆరు మ్యాచులాడి మూడింట గెలిచి అన్నే మ్యాచులు ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు.. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముగిసిన మ్యాచ్ లో ఆడని ఆ జట్టు సారథి మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. ఓడియన్ స్మిత్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు. ఇక కరోనాతో కలవరపడుతున్న ఢిల్లీ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నది. మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ రెండు జట్లు తాము ఆడిన గత మ్యాచులలో ఓడి పాయింట్ల పట్టికలో వెనుకబడ్డాయి. ఈ మ్యాచ్ లో గెలిచి ముందంజ వేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి.
ముఖాముఖి : ఇరు జట్లు 28 మ్యాచుల్లో ఎదురుపడగా.. ఢిల్లీ 13, పంజాబ్ 15 మ్యాచులలో విజయాలు సాధించాయి. గత 5 మ్యాచ్ల్లో ఢిల్లీ ఏకంగా నాలుగింటిలో గెలుపొంది పంజాబ్పై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, నాథన్ ఎల్లిస్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్