T20 Worldcup 2021: షోయబ్ మాలిక్ మెరుపులు, భారీ స్కోరు చేసిన పాకిస్తాన్... స్కాట్లాండ్ ముందు...

By Chinthakindhi RamuFirst Published Nov 7, 2021, 9:11 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో బాబర్ ఆజమ్ నాలుగో హాఫ్ సెంచరీ... ఆరు సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదిన షోయబ్ మాలిక్... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో స్కాట్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి సూపర్ 12 రౌండ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. 

మహ్మద్ రిజ్వాన్ 19 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఏడాది టీ20ల్లో 1667 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, ఒక ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2015లో 1665 పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు మహ్మద్ రిజ్వాన్...

Read: వెస్టిండీస్‌కి ఊహించని ఎదురుదెబ్బ... టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీ సూపర్ 12లో దక్కని చోటు...

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి, సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. క్రిస్ గ్రీవ్స్ బౌలింగ్‌లో మున్సేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బాబర్ ఆజమ్. ఫకార్ జమాన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి క్రిస్ గ్రీవ్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 

మహ్మద్ హఫీజ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి సఫ్యాన్ షరీఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ సిక్సర్ మోత మోగించాడు. 18 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు చేసిన షోయబ్ మాలిక్, యువరాజ్ సింగ్ 12 బంతుల్లో, మోబర్గ్ 17 బంతుల్లో తర్వాత అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాముల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో కలిసి సమంగా నిలిచాడు షోయబ్ మాలిక్...

Read Also: ఇంకేముందిలే, ఇక బ్యాగులు సర్దుకోవడమే... ఐదు నెలల తర్వాత స్వదేశానికి రానున్న టీమిండియా...

పాకిస్తాన్ తరుపున షోయబ్ మాలిక్‌దే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇంతకుముందు ఉమర్ అక్మల్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును అధిగమించి, సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు షోయబ్ మాలిక్. స్కాట్లాండ్‌పై షోయబ్ మాలిక్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం...

19వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో 17 పరుగులు రాబట్టిన షోయబ్ మాలిక్, ఆ తర్వాత ఆఖరి ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 26 పరుగులు రాబట్టాడు. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు తీసి 60 పరుగులు మాత్రమే చేసిన పాకిస్తాన్, ఆ తర్వాతి 10 ఓవర్లలో 139 పరుగులు రాబట్టడం విశేషం. 

పాకిస్తాన్ ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే ఐదుకి ఐదు మ్యాచుల్లో విజయాలు అందుకుని, ప్లేఆఫ్స్‌కి చేరిన జట్టుగా నిలుస్తుంది పాకిస్తాన్. గ్రూప్ 1 నుంచి ప్లేఆఫ్స్ చేరిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా నాలుగేసి విజయాలు మాత్రమే అందుకున్న విషయం తెలిసిందే. 
 

click me!