T20 world Cup2021:ఈ హైఓల్టేజీ మ్యాచ్ కు ముందు బాబర్ ఆజమ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. గత రికార్డులు ఎలా ఉన్నా ఈసారి పోటీలో విజయం తమదేనని కుండబద్దలు కొట్టాడు. ప్రపంచకప్ లో భారత్ పై గెలుస్తామని అతడు ధీమా వ్యక్తం చేశాడు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరో 48 గంటల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ సమరం మొదలుకానున్నది. రెండేండ్ల తర్వాత భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) లు మళ్లీ గ్రౌండ్ లో హోరాహోరి తలపడబోతున్న సందర్భంలో ఇరు జట్ల ఆటగాళ్లలో ఒత్తిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. గత రికార్డులన్నీ భారత్ (India)కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆదివారం జరుగబోయే మ్యాచ్ పై పాక్ సారథి (Pakistan captain) బాబర్ ఆజమ్ (babar azam) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ హైఓల్టేజీ మ్యాచ్ కు ముందు బాబర్ ఆజమ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. గత రికార్డులు ఎలా ఉన్నా ఈసారి పోటీలో విజయం తమదేనని కుండబద్దలు కొట్టాడు. ప్రపంచకప్ లో భారత్ పై గెలుస్తామని అతడు ధీమా వ్యక్తం చేశాడు. గతంలో జరిగిన మ్యాచ్ ల గురించి తాము దృష్టి పెట్టడం లేదని, ఆదివారం నాటి పోరులో ఎవరు మంచి క్రికెట్ ఆడితే వాళ్లే గెలుస్తారని అన్నాడు.
బాబర్ ఆజమ్ మాట్లాడుతూ...‘మీరు ఒక పెద్ద టోర్నీలో పాల్గొంటున్నప్పుడు మీకు ఆత్మ విశ్వాసం, నైతిక స్థైర్యం అవసరం. ఒక జట్టుగా మా జట్టు కాన్ఫిడెన్స్ బాగా ఉంది. గతం గత: మేము దాని గురించి ఆలోచించడం లేదు. మేము జరుగబోయే మ్యాచ్ ల గురించి దృష్టి పెట్టాం. ఇందుకు మేమంతా సిద్ధమయ్యాం. ఆ మ్యాచ్ లో మేమంతా మంచి క్రికెట్ ఆడతాం’ అని అన్నాడు.
భారత్-పాక్ మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందన్న ఆజమ్.. తమ జట్టు కామ్ గా ఉండి భారత్ పై విజయం సాధిస్తామని చెప్పుకొచ్చాడు. ‘భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఆటగాళ్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మేం మా అత్యున్నత ఆటను ఆడటానికి ప్రయత్నిస్తాం. మేం ప్రశాంతంగా ఉంటూ క్రికెట్ మీద దృష్టి పెడతాం. ఆ మ్యాచ్ లో మేం బాగా ఆడాల్సి ఉంది’ అని చెప్పాడు.
ఇది కూడా చదవండి: India vs Pakistan: భారత్ తో మ్యాచ్ లో పాక్ ఓడిపోతే బ్యాగ్ సర్దుకోవాల్సిందే.. ఆసీస్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు
యూఏఈ పిచ్ ల మీద గత మూడు నాలుగేళ్లుగా పాక్ తరుచూ మ్యాచ్ లు ఆడుతుందని, అది కచ్చితంగా తమ జట్టుకు లాభించే అంశమని బాబర్ తెలిపాడు. ఇక్కడి పరిస్థితుల మీద తమకు పూర్తి అవగాహన ఉన్నదని, తమ ఆటగాళ్లు వాటికి అనుగుణంగా మలుచుకుంటారని అభిప్రాయపడ్డాడు. గ్రౌండ్ లో ఎవరు బాగా ఆడితే వారిదే విజయమని ఆజమ్ స్పష్టం చేశాడు.
ఐసీసీ టోర్నీలలో భారత్-పాక్ మ్యాచ్ లు.. వాటి ఫలితాలను ఓసారి చూస్తే..
వన్డే ప్రపంచకప్ లో ఇరు దేశాలు ఏడు సార్లు తలపడ్డాయి. ఏడు సార్లు భారత్ దే విజయం. టీ20 ప్రపంచకప్ లో రెండు జట్లు 5 సార్లు ఢీకొన్నాయి. ఇందులో భారత్ నాలుగు మ్యాచుల్లో గెలవగా.. ఒక మ్యాచ్ టై అయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య 5 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్ లలో నెగ్గగా.. పాకిస్థాన్ మూడింటిలో గెలిచింది. మొత్తంగా చూస్తే 17 మ్యాచ్ లకు గాను భారత్-13.. పాకిస్థాన్-3 లలో గెలిచాయి. ఒక మ్యాచ్ టై అయింది. ఆదివారం జరుగబోయే మ్యాచ్ లో కూడా పాక్ ను మట్టి కరపించాలని విరాట్ కోహ్లి (virat kohli) సారథ్యంలోని భారత జట్టు భావిస్తున్నది.