T20 World Cup: ఆరంభ మ్యాచ్ లో తేలిపోయిన పపువా న్యూ గినియా.. ఆతిథ్య జట్టు ముందు ఈజీ టార్గెట్

Published : Oct 17, 2021, 05:27 PM IST
T20 World Cup: ఆరంభ మ్యాచ్ లో తేలిపోయిన పపువా న్యూ గినియా.. ఆతిథ్య జట్టు ముందు ఈజీ టార్గెట్

సారాంశం

ICC T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య ఓమన్ జట్టు బౌలింగ్  లో దుమ్ము రేపింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. తొలి సారి టీ20 ప్రపంచకప్ లో పాల్గొంటున్న పపువా న్యూ గినియా ను నిలువరించింది. 

దాదాపు ఐదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత యూఏఈ (UAE) వేదికగా ప్రారంభమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) లో ఆతిథ్య ఓమన్ (Oman) జట్టు బౌలింగ్ లో అదరగొట్టింది. టాస్ గెలిచిన ఆ జట్టు ప్రత్యర్థి పపువా న్యూ గినియా (papua New Guinea) ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓమన్ రాజధాని మస్కట్ లోని అల్ అమెరట్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9  వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓమన్ కెప్టెన్ జీషన్ (Zeeshan Masooq) సూపర్ స్పెల్ వేసి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పీఎన్జీ (PNG)జట్టుకు శుభారంభం అందివ్వడంలో ఓపెనర్లు విఫలమయ్యారు. స్కోరు బోర్డుపై పరుగులేమీ చేరకుండానే టోనీ ఉర (0), లెగ సియాకా (0) ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆదిలోనే ఇబ్బందుల్లో పడ్డ జట్టును వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ అస్సద్ వాల (Assad wala) (43 బంతుల్లో 56).. చార్లెస్ అమిని (26 బంతుల్లో 37) ఆదుకున్నారు. 

 

వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 80 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో కెప్టెన్ అస్సద్.. 40 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ 11.3 ఓవర్లో ఈ జొడీని నదీమ్ విడదీశాడు. అద్బుతమైన త్రో తో నదీమ్.. చార్లెస్ ను రనౌట్ గా వెనక్కి పంపాడు. చార్లెస్ ఔటయ్యాక కొద్దిసేపటికే.. 14.1 ఓవర్లో కరీముల్లా బౌలింగ్ లో జతిందర్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 

ఈ ఇద్దరూ ఔటయ్యాక వచ్చిన బ్యాట్స్మెన్ అంతా వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. దీంతో 14.1 ఓవర్లు  ముగిసేసరికి 102/4 గా ఉన్న పీఎన్జీ.. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓమన్ బౌలర్ల ధాటికి ఆ జట్టు చివరి 5 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆరంభ మ్యాచ్ లో గెలవాలంటే ఓమన్ 130 పరుగులు చేస్తే చాలు.

ఓమన్ బౌలర్లు పీఎన్జీ ఆటగాళ్లను కట్టడి చేశారు. ముఖ్యంగా కెప్టెన్ జీషన్ మసూఖ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్లు వేసిన జీషన్.. 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతడితో పాటు బిలాల్ ఖాన్ 4 ఓవర్లేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఖరీముల్లాకు 2 వికెట్లు దక్కాయి.  

PREV
click me!

Recommended Stories

Cricket: పాములు, కీట‌కాలు, చీమ‌లు.. వీటివ‌ల్ల కూడా మ్యాచ్‌లు ఆగిపోయాయ‌ని తెలుసా.?
IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు