T20 worldcup: ఆ ఒక్కన్ని ఔట్ చేయండి చాలు.. పాక్ పై విజయం మీదే.. భారత్ కు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ సూచన

By team teluguFirst Published Oct 20, 2021, 5:50 PM IST
Highlights

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈనెల 24న భారత్-పాక్ ల మధ్య బిగ్ ఫైట్ జరుగబోతున్నది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవడానికి ఇంగ్లండ్ మాజీ  స్పిన్నర్ మాంటీ పనేసర్ పలు సూచనలు చేశాడు. 

ఈనెల 24న భారత్ (India).. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)ని ఢీకొనబోతున్నది. ఇప్పటికే ఈ పోరుకు సంబంధించి ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం,  ఈ మధ్య కాలంలో ఇరు జట్లు ముఖాముఖి తలపడకపోవడం, రెండు దేశాల రాజకీయ నాయకుల విమర్శలు ప్రతివిమర్శలు.. ఇలా ప్రతీదీ  ఇండియా-పాక్ (India Vs Pakistan) మ్యాచ్ కు హైప్ తీసుకొచ్చాయి. అయితే రాబోయే మ్యాచ్ లో ఎలా గెలవాలనేదానిపై ఇరు జట్లకు పలువురు సీనియర్ ఆటగాళ్లు సూచనలు చేస్తున్నారు. ఇదే విషయమై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (monty panesar).. భారత్ విజయానికి కీలక సూచన చేశాడు. 

పనేసర్ మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో భారత్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నది. భారత  జట్టు ఫైనల్ చేరుతుందనడంలో సందేహమే లేదు. ఈసారైనా ఐసీసీ టైటిల్ సాధించాలని విరాట్ (Virat kohli) తాపత్రాయపడుతున్నాడు. ఈ అవకాశాన్ని అతడు అంత సులువుగా వదులుకోడు. ఎందుకంటే కెప్టెన్ గా ఇదే చివరి అవకాశం. అందుకే అతడు  టైటిల్ కోసం పోరాడుతాడు. ఇక పాకిస్థాన్ తో మ్యాచ్ లో  భారత్.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ను త్వరగా ఔట్ చేస్తే పాక్ కథ ముగిసినట్టే. మిగతా బ్యాట్స్మెన్ ను ఔట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు’ అని అన్నాడు. 

ఇది కూడా చదవండి: T20 World Cup: ఎవరెన్ని చెప్పినా సరే.. ఇది స్పిన్నర్ల ప్రపంచకప్.. ఐపీఎల్లో కనిపించలేదా..? రషీద్ ఖాన్ కామెంట్స్

T20 Worldcup 2021: జెర్సీ రూపొందించిన 12 ఏండ్ల బాలిక.. థ్యాంక్స్ చెప్పిన స్కాట్లాండ్

బాబర్ ఆజమ్ తో పాటు మరో బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా ప్రమాదకారే అని పనేసర్ అన్నాడు. వీరిరువురు కలిసి గత కొద్దికాలంగా నిలకడగా రాణిస్తున్నారు.  ఒకరకంగా చెప్పలంటే పాక్ బ్యాటింగ్ కు ఈ ఇద్దరు ఆటగాళ్లు మూలస్తంభాలు. పనేసర్ ఇదే విషయాన్ని గుర్తు చేశాడు. ఆ ఇద్దరినీ భారత బౌలర్లు త్వరగా పెవిలియన్ కు పంపితే సగం మ్యాచ్ గెలిచినట్టేనని చెప్పాడు. 

ఇక యూఏఈ పిచ్ ల మీద పాకిస్థాన్ అత్యుత్తమ జట్టు అని అన్న పనేసర్.. తమదైన రోజున ఆ జట్టు  ప్రపంచంలోని ఏ దేశాన్నైనా ఓడించగలదని అన్నాడు. ‘యూఏఈ పిచ్ ల మీద పాకిస్తాన్ మంచి  ట్రాక్ రికార్డు ఉంది. షాహీన్ అఫ్రిది సారథ్యంలోని మెరుగైన బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లో బాబర్ ఆజమ్  వంటి ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండటం వాళ్లకు కలిసొచ్చే అంశం. అయితే భారత్ తో పోలిస్తే మాత్రం ఆ జట్టు  వెనుకబడే ఉంది. రికార్డులు, ఇటీవల కాలంలో ప్రదర్శన చూస్తే టీమిండియానే ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా ఉంది.  వచ్చే మ్యాచ్ లో పాకిస్తాన్ మీదే ఒత్తిడి అధికంగా ఉంటుంది’ అని తేల్చేశాడు. 

click me!