
బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన శ్రీలంక కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్ కుశాల్ మెండీస్ మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ నుంచి వైదొలిగాడు. తీవ్రమైన ఛాతినొప్పి వేధించడంతో అతడు గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడి దగ్గరికి పరిగెత్తుకొచ్చిన ఫిజియో, సహాయ సిబ్బంది అతడిని పెవిలయన్ కు తీసుకెళ్లి అట్నుంచి అటే ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందనేదానిపై లంక క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
బంగ్లాదేశ్-శ్రీలంక ల మద్య ఢాకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ 22వ ఓవర్లో.. లంచ్ కు కొద్దిసేపటి ముందు మెండిస్ కు ఛాతినొప్పి వచ్చింది.
22వ ఓవర్లో స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న మెండిస్.. బంతి తన వద్దకు రాగానే అందుకునే ప్రయత్నం చేశాడు. అలా కిందికి వంగగానే అక్కడే కూలబడిపోయాడు. అనంతరం మెల్లగా లేచి ఛాతి మీద చెయ్యి వేయడంతో జట్టు ఫిజియోతో పాటు ఇతర సిబ్బంది వచ్చారు. క్రమంగా నొప్పి ఎక్కువవడంతో అతడు దానిని ఓర్చుకోలేక గ్రౌండ్ ను వీడడానికే నిశ్చయించుకున్నాడు.
గ్రౌండ్ నుంచి వెళ్తూ కూడా మెండిస్.. తన చేతిని ఛాతి వద్దే ఉంచుకోవడం గమనార్హం. పెవిలియన్ కు వెళ్లిన తర్వాత మెండిస్ ను అట్నుంచి అటే ఆస్పత్రికి కూడా తరలించారు. అయితే ప్రస్తుతం మెండిస్ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని లంక బోర్డు ఇంకా వెల్లడించలేదు.
ఇదిలాఉండగా.. రెండో టెస్టులో ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ తర్వాత కోలుకుంది. తొలిరోజు 60 ఓవర్లు ముగిసేసరికి
బంగ్లా.. 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ముష్ఫీకర్ రహీమ్ (77 నాటౌట్) లిటన్ దాస్ (79 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. అంతకుముందు.. 24 పరుగులకే లంక ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్, తమీమ్ ఇక్బాల్ లు డకౌట్ అయ్యారు. నజ్ముల్ హుస్సేన్ (8), కెప్టెన్ మోమినుల్ హక్ (9), షకిబ్ అల్ హసన్ (0) కూడా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో కసున్ రజిత కు 3 వికెట్లు దక్కగా.. అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీశాడు.