
గత నెల 29న ఇంగ్లాండ్ లోని బ్రిడ్జ్ వాటర్ లో గల ఓ పబ్ ఎదుట దాడికి గురైన సౌతాఫ్రికా యువ క్రికెటర్ మొండ్లి ఖుములొ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. వారం రోజులుగా కోమాలోనే ఉన్న అతడు.. శుక్రవారం కోమా నుంచి కోలుకున్నాడని.. బాగానే మాట్లాడుతున్నాడని అతడి సహచర క్రికెటర్ లాయిడ్ ఐరిస్ తెలిపాడు. యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఖుములొ పై గత ఆదివారం దుండగులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
కౌంటీలలో నార్త్ పెర్తర్టన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖుములొ ఆరోగ్య పరిస్థితిపై ఐరిష్ మాట్లాడుతూ.. ‘అతడు శుక్రవారం కోమాలోంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఖుములొ తన తల్లి కోసం ఆరా తీశాడు. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్టు ను చూస్తున్నాడు.
అంతేగాక తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్త్ పెర్తర్టన్ తదుపరి మ్యాచ్ ఎప్పుడుంది..? తాను ఎప్పుడు కోలుకుంటాడు..? అనే విషయాల గురించి ఆరా తీస్తున్నాడు’ అని తెలిపాడు. గడిచిన 24 గంటల్లో అతడు బాగా కోలుకున్నాడని ఐరిష్ చెప్పాడు.
ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మొండ్లి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడూ అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాం. ఇక ఘటనకు సంబంధించ విచారణ వేగంగా జరుగుతున్నది. సీసీటీవీ ఫుటేజీతో పాటు స్థానికంగా ఉంటున్నవారి దగ్గర వివరాలు సేకరిస్తున్నాం. ఘటన జరిగినప్పుడు చాలా మంది ఉన్నారని మాకు సమాచారం అందింది. వారిలో సాక్షికోసం వెతుకుతున్నాం..’ అని తెలిపారు.
20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు నాటల్ ఇన్లాండ్ తరపున టీ20 లలో అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్లు, 4 టీ20 మ్యాచ్లు ఆడాడు.