
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఆ జట్టు మాజీ సారథి మిగ్నాన్ డూ ప్రీజ్.. టెస్టులు, వన్డేలకు వీడ్కోలు చెప్పింది. ఈ రెండు ఫార్మాట్ ల నుంచి రిటైరవుతున్నట్టు ఆమె ప్రకటించింది. దక్షిణాఫ్రికా తరఫున నాలుగు వన్డే ప్రపంచకప్ లు ఆడిన ఆమె.. ఇక తాను విరామం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపింది. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాని అందుకే రిటైర్మెంట్ ప్రకటించానని వెల్లడించింది. 2007 లో దక్షిణాఫ్రికా తరఫున ఎంట్రీ ఇచ్చిన ఆమె.. పదిహేనేండ్ల పాటు ఆ దేశానికి సేవలందించింది.
ఈ సందర్భంగా డూ ప్రీజ్ మాట్లాడుతూ.. ‘నా దేశం తరఫున ఇప్పటికే 4 వన్డే ప్రపంచకప్ లలో ఆడాను. అది నా అదృష్టం. ఇవి నా జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాలు. అయితే నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాను.
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు సహచర ఆటగాళ్లకు అభిమానులకు ధన్యవాదాలు..’ అని తెలిపింది. డూ ప్రీజ్ ప్రకటనను క్రికెట్ సౌతాఫ్రికా విడుదల చేసింది.
2007లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేసిన డూప్రీజ్.. ఆ దేశం తరఫున అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్ గా అరుదైన ఘనతను అందుకుంది. డూప్రీజ్ తన వన్డే కెరీర్ లో 154 మ్యాచులు ఆడింది. ఒక టెస్టు (భారత్ తో) కూడా ఆడింది. వన్డేలలో 3,760 పరుగులు చేసింది. ఇందులో 18 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. ఇక భారత్ తో ఆడిన ఏకైక టెస్టులో 119 పరుగులు సాధించింది. ఈ మ్యాచులో ఆమె సెంచరీ చేయడం విశేషం. టీ20లలో దక్షిణాఫ్రికా తరఫున.. 108 మ్యాచులలో ప్రాతినిథ్యం వహించి.. 1,750 పరుగులు చేసింది. ఇందులో 7 హాఫ్ సెంచరీలున్నాయి.
2007 నుంచి 2016 వరకు 46 వన్డేలలో ఆమె దక్షిణాఫ్రికాకు సారథిగా కూడా పనిచేసింది. తన సారథ్యంలో దక్షిణాఫ్రికాను 24 మ్యాచులలో గెలిపించింది డూప్రీజ్.
ఇటీవలే ముగిసిన మహిళల ప్రపంచకప్ ఆమె కు చివరిది. గత నెలలో సెమీస్ కు చేరాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో చివరి బంతి వరకు క్రీజులో ఉండి సఫారీలను గెలిపించింది డూప్రీజే కావడం గమనార్హం. ఇక ఇంగ్లాండ్ తో ముగిసిన సెమీస్ మ్యాచ్ ఆమెకు చివరి వన్డే. ఈ మ్యాచులో ఆమె 30 పరుగులు చేసింది.