India Test Captain : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్కు ముందు కెప్టెన్సీ నిర్ణయంపై తలపట్టుకుంటోంది. ఈ సిరీస్కు ఇంకా నెలరోజులు మాత్రమే మిగిలి ఉంది... అయినా ఇంకా జట్టును ఎంపిక చేయలేదు. రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తదుపరి కెప్టెన్ గా ఎవరికి నియమించాలన్న డైలమా కొనసాగుతోంది. అందుకే జట్టు ఎంపిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే టీమిండియా యువ సంచలనం శుభ్మన్ గిల్ భారత జట్టుకు తదుపరి టెస్ట్ కెప్టెన్గా ఎదగనున్నట్లు పలు సంకేతాలు కనిపిస్తున్నాయి. గిల్ ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు... జట్టును సక్సెస్ ఫుల్ గా ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో అతడినే అధికారికంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్గా ప్రకటించే అవకాశముందని బాగా ప్రచారం జరుగుతోంది. సెలక్టర్లు ఇంగ్లాండ్ పర్యటనలోనే గిల్ను కెప్టెన్గా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.
మరోవైపు జస్ప్రీత్ బుమ్రాకు కూడా కెప్టెన్సీ అవకాశాలున్నాయి... కానీ గిల్ తో పోలిస్తే ఇతడికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నాలుగు నెలల క్రితం సిడ్నీలో జరిగిన టెస్ట్ సందర్భంగా బుమ్రా తన వెన్నునొప్పితో మైదానం వీడాడు. ఇలా అతడు అర్ధాంతరంగా గాయంతో బయటకు వెళ్లడంతో ఈ మ్యాచ్లో భారత విజయాశలు గల్లంతయ్యాయి. అదే సమయంలో బుమ్రా నాయకత్వం అవకాశాలూ మందగించాయని విశ్లేషకులు చెబుతున్నారు.
31ఏళ్ల బుమ్రాకు వరుసగా ఐదు టెస్టులు ఆడటం కష్టమేనని నివేదికలు చెబుతున్నాయి. సిడ్నీ గాయం తర్వాత మూడు నెలల పాటు బుమ్రా ఎలాంటి క్రికెట్ ఆడలేదు. అంతకుముందు కూడా టి20 వరల్డ్ కప్కు ముందు గాయంతో సుమారు ఏడాది పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇవన్నీ బుమ్రాను టెస్ట్ కెప్టెన్సీ నుండి దూరం చేస్తున్నాయి.
అయితే గిల్ ఆకస్మికంగా కెప్టెన్ స్థాయికి ఎదగడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సునీల్ గవాస్కర్ లాంటి మాజీ సీనియర్లు కొందరు గిల్ కు టీమిండియా పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎక్కువమంది సీనియర్లు బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా వైపే మొగ్గు చూపిస్తున్నారు. బుమ్రా ఇప్పటికే కెప్టెన్ గా నిరూపించుకున్నాడు కాబట్టి అతడికే పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బిసిసిఐకి సూచిస్తున్నారు.
ఇక గిల్ నాయకత్వం ప్రారంభానికి సంబంధించి రెండు కీలక పరిణామాలు కనిపించాయి. ఒకటి ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లినపుడు గిల్ టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ నివాసానికి వెళ్లి నాలుగైదు గంటల పాటు చర్చలు జరిపారు. రెండవది ముంబయి ఇండియన్స్తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతర భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగర్కర్ గిల్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత టెస్ట్ జట్టు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో బుమ్రాకు పూర్తిస్థాయి నాయకత్వ భవిష్యత్తు సుదూరంగా కనిపిస్తోంది.