
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రెండున్నర నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న పంత్.. మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు. ఎవరి సాయం లేకుండానే పంత్.. ధీమాగా నడవగలుగుతున్నాడు. గతంలో ఓ చిన్న చేతికర్రతో నడుస్తున్న వీడియో షేర్ చేసిన పంత్.. ఇప్పుడు వాటర్ పూల్ లో నడిచిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
వీడియోను షేర్ చేస్తూ పంత్.. ‘చిన్న విషయాలు, పెద్ద విషయాల మధ్యలో ప్రతీదానికీ కృతజ్ఞతలు..’అని రాసుకొచ్చాడు. గాయం తర్వాత తన హెల్త్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్న పంత్.. తాజాగా ఈ వీడియోను విడుదల చేసి తాను కోలుకుంటున్నానిని చెప్పకనే చెప్పాడు.
నెల రోజుల క్రితం పంత్ తన ఇన్స్టా గ్రామ్ లో.. ‘ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మెరుగ్గా..’అని రాసుకొచ్చాడు. కార్ యాక్సిడెంట్ తర్వాత నాలుగు రోజుల పాటు ఉత్తరాఖండ్ లోనే చికిత్స పొందిన పంత్ కు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బీసీసీఐ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.
పంత్ గైర్హాజరీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు లేని లోటు స్పష్టంగా తెలిసిందని నెటిజన్లు వాపోయారు. నాగ్పూర్, ఢిల్లీ, ఇండోర్ లలో టెస్టులో కూడా చాలా మంది అభిమానులు ‘పంత్ వి మిస్ యూ..’అని ప్లకార్డులు పట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాపై పంత్ కు మంచి రికార్డు ఉంది.
గాయం కారణంగా పంత్ ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి కీలక టోర్నీలు మిస్ కానున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ వరకైనా అతడు కోలుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.