
గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు కారులో వెళ్తూ రూర్కీ (ఉత్తరాఖండ్) వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలైన టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ కోలుకుంటున్నాడు. తాజాగా అతడు తన సోషల్ మీడియా ఖాతాలలో కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. ఊతకర్ర సాయంతో నడుస్తున్న అతడు.. ‘ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా’ వేస్తున్నానని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.
యాక్సిడెంట్ తర్వాత పంత్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రోడ్డు ప్రమాదం తర్వాత తనను కాపాడినవారికి ధన్యవాదాలు చెబుతూ పంత్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ పోస్ట్ లో పంత్ కనిపించలేదు.
కానీ తాజాగా షేర్ చేసిన ఫోటోలలో పంత్.. ఊతకర్ర సాయంతో అటూ ఇటూ నడుస్తున్న ఫోటోలను ఉంచాడు. ఆ ఫోటోల కింద.. ‘ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మెరుగ్గా..’అని రాసుకొచ్చాడు. కార్ యాక్సిడెంట్ తర్వాత నాలుగు రోజుల పాటు ఉత్తరాఖండ్ లోనే చికిత్స పొందిన పంత్ కు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బీసీసీఐ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
పంత్ కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. మోకాలి నుంచి పాదం వరకు కట్టు కట్టి ఉండగా ఊతకర్రల సాయంతో పంత్ ఒక్కో అడుగు వేస్తూ కాసేపు ఆస్పత్రి ఆవరణలోని బాల్కనీలో గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోకు టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్ లతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై, ముంబై, లక్నో లు కామెంట్స్ చేస్తున్నారు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ‘థింకింగ్ యూ బ్రదర్’అంటూ కామెంట్ చేశాడు.
ఇదిలాఉండగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుందంటూ నెటిజన్లు వాపోతున్నారు. నాగ్పూర్ వేదికగా ఇటీవలే ప్రారంభమైన తొలి టెస్టులో కూడా చాలా మంది ‘పంత్ వి మిస్ యూ..’అని ప్లకార్డులు పట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాపై పంత్ కు మంచి రికార్డు ఉంది. అతడి గైర్హాజరీలో ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్.. తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే వికెట్ కీపింగ్ లో ఫర్వాలేదనిపించిన భరత్.. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. నిన్న.. 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.