
Rishabh Pant roly poly shot: లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్ – ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ టో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు టాపార్డర్ రాణించడంతో భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ భారత్ కు మంచి ఆరంభం అందించారు. కేఎల్ రాహుల్ 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జైస్వాల్ 101 పరుగలతో సెంచరీ కొట్టాడు. శుభ్ మన్ గిల్ 147 పరగులతో కెప్టెన్ నాక్ ఆడాడు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడతూ 134 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
తొలి రోజు రిషభ్ పంత్ 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో రోజు పంత్ దూకుడుగా ఆడుతూ సెంచరీ కొట్టాడు. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సిక్సర్ తో రిషబ్ పంత్ తన సెంచరీని పూర్తి చేశాడు. 146 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో పంత్ 134 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంత్ ఇన్నింగ్స్ పై దిగ్గజ ప్లేయర్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇంగ్లండ్తో జరిగిన మొదటి టెస్టు రెండో రోజు రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. తనదైన శైలిలో 134 పరుగులు చేసిన పంత్ ఆటలోని నైపుణ్యలు, తెలివితేటలు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు అందుకున్నాయి. పంత్ వినూత్నంగా ఆడిన ఫాలింగ్ ప్యాడిల్ స్వీప్ పై సచిన్ ప్రత్యేకంగా స్పందించారు.
పంత్ తక్కువ సమయంలోనే ఆటపై అద్భుతమైన పట్టు సాధించాడనీ, అతడి ఫాలింగ్ ప్యాడిల్ స్వీప్ అనుకోకుండా కాదు.. బాగా ఆలోచించి ఆడిన షాట్ అని టెండూల్కర్ పేర్కొన్నారు. "రిషబ్ ఫాలింగ్ ప్యాడిల్ స్వీప్ యాధృచ్ఛికం కాదు. అది ఉద్దేశపూర్వకమైనది, చురుకైనది. ఇలా షాట్ ఆడడం ద్వారా అతను బంతిని కంట్రోల్గా లెగ్ స్లిప్ మీదుగా కొట్టగలిగాడు" అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా, మ్యాచ్లో మరో ఆసక్తికర అంశాన్ని కూడా సచిన్ హైలైట్ చేశారు. "బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ ఇద్దరూ బాల్స్ మధ్యలో హిందీలో బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం సరదా సంభాషణ కాదు. వారు బౌలర్ రిథమ్ను చెడగొట్టేందుకు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు" అని సచిన్ పేర్కొన్నారు.
సచిన్ మెచ్చిన ఈ రోలీపోలీ షాట్ ను రిషబ్ పంత్ తన సెంచరీకి ముందు కొట్టాడు. 'రోలీపోలి' అనే వినూత్న షాట్ ను షోయబ్ బషీర్ వేసిన లెగ్స్టంప్ బంతిని లెగ్ స్లిప్ మీదుగా ఫైన్ లెగ్కు పంపిస్తూ, నేలపై పడిపోయి తిరుగుతూ చేసిన స్టైల్ షాట్. ఈ దృశ్యం అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఇషా గుహా ఈ షాట్ను “It’s a roly-poly shot!” అంటూ పేర్కొన్నారు.
కాగా, జేమ్స్ అండర్సన్పై పంత్ రివర్స్ స్వీప్ ఆడినప్పటి నుంచి, ప్యాట్ కమిన్స్ను స్కూప్ చేసిన సందర్భం వరకు పంత్ ఆట శైలి విమర్శల పాలైంది. కానీ ఇప్పుడు అదే ఆటతీరుతో ప్రశంసలు అందుకుంటున్నాడు. లీడ్స్ పిచ్పై, షోయబ్ బషీర్ లెగ్ స్లిప్తో బౌలింగ్ చేస్తున్న సమయంలో, పంత్ అంచనా వేసి, ఒక మోకాలపై ఫాలింగ్ స్వీప్ ఆడి బంతిని బౌండరీ లైన్ కు పంపడం అద్భుతంగా ఉంది.
రిషబ్ పంత్ పై గతంలో తీవ్ర విమర్శలు చేసిన లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఇప్పుడు ప్రశంసలు కురిపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఆడిన ఒక షాట్ తో అవుట్ కావడంపై గవాస్కర్ పంత్ ను 'స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్' అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఇప్పుడు సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత 'సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్' అని ప్రశంసించారు.
ఈ ఇన్నింగ్స్లో పంత్తో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ తన సెంచరీని బషీర్ బౌలింగ్ లో సిక్సర్తో పూర్తి చేశాడు. తనదైన సోమర్సాల్ట్ విన్యాసాలతో సెంచరీ సంబరాలు చేసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో అత్యంత ఖరీదైన ప్లేయర్ రిషబ్ పంత్. పంత్ న రూ. 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో వరుసగా విఫలమవుతూ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అయితే, ఇప్పుడు ఇంగ్లాండ్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా స్పందిస్తూ, "ఐపీఎల్ ఫామ్ పంత్ ఇంగ్లండ్లో చేసే పనిపై ప్రభావం చూపదు. అతడు టెస్ట్ క్రికెట్లో నిజమైన మ్యాచ్ విన్నర్" అని పేర్కొన్నారు.