
ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. వారిలో కొందరు టీమిండియాలోకి వచ్చి, స్టార్ ప్లేయర్లుగా వెలుగొందితే మరికొందరు ఒకటి రెండు సీజన్లకే పరిమితమై, ఆ తర్వాత మాయమైపోయారు. ఈ రెండో జాబితాకి చెందిన వాడే పాల్ వాల్తేటి...
ఐపీఎల్ 2011 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేసిన పాల్ వాల్తేటి, అద్భుత సెంచరీతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. 2002 అండర్19 వన్డే వరల్డ్ కప్లో టీమిండియాకి ఆడిన పాల్ వాల్తేటి మెరుపులు, 2011 సీజన్ తర్వాత పెద్దగా కనిపించలేదు..
కంటికి గాయం కావడంతో ప్రొఫెషనల్ క్రికెట్కి దూరంగా ఉంటూ వస్తున్న పాల్ వాల్తేటి, 39 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్కి ఈ విషయాన్ని తెలియచేస్తూ లేఖ రాశాడు పాల్ వాల్తేటి..
‘నా కెరీర్లో ఎన్నో జట్లకు ఆడాను. ఛాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా బ్లూ టీమ్కి, ఇండియా అండర్19 టీమ్కి, ముంబై సీనియర్స్ టీమ్కి ఆడే అవకాశం దక్కినందుకు గర్వపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి, ముంబై క్రికెట్ అసోసియేషన్కి ధన్యవాదాలు..
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తరుపున ఆడడాన్ని ఎప్పుడూ మరిచిపోలేను. ముంబై నుంచి వచ్చి ఐపీఎల్లో సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ని, నాలుగో భారత క్రికెటర్ని నేనే. నా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా...’ అంటూ ఎమ్సీఏకి రాసిన లేఖలో రాసుకొచ్చాడు పాల్ వాల్తేటి..
2002 అండర్19 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓ బౌన్సర్, నేరుగా పాల్ వాల్తేటి కంటికి బలంగా తాకింది. ఆ గాయంతోనే కొన్నాళ్ల పాటు కెరీర్ని కొనసాగించిన పాల్ వాల్తేటి, కొన్నాళ్లకు కంటిచూపును కొద్దికొద్దిగా కోల్పోయాడు. అయితే చూపు మందగించినా క్రికెట్పైన ఇష్టం మాత్రం చావకపోవడంతో ఆటను కొనసాగిస్తూనే వచ్చాడు.
పాల్ వాల్తేటి అసలు పేరు పాల్ చంద్రశేఖర్ వాల్తేటి. 2011 సీజన్లో పాల్ వాల్తేటి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 189 పరుగుల భారీ టార్గెట్ను 19.1 ఓవర్లలో చేధించింది పంజాబ్ కింగ్స్... ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ వాల్తేటియే...
2011 సీజన్లో 463 పరుగులు చేసిన పాల్ వాల్తేటి, ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత వరుసగా రెండు సీజన్లలో పాల్ వాల్తేటి ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్న పాల్ వాల్తేటి, కంపెనీ తరుపున క్రికెట్ టోర్నీలు ఆడుతున్నాడు..