
Pakistan vs UAE: ఆసియా కప్ 2025లో పదో మ్యాచ్ లో పాకిస్తాన్, యూఏఈ తలపడనున్నాయి. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, పాకిస్తాన్ మ్యాచ్కు ముందు జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ను రద్దు చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ ఐసీసీని కోరింది. వినకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని బెదిరించింది. కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ల మాటలను సీరియస్గా తీసుకోకుండా ఆ డిమాండ్ను తిరస్కరించింది.
యూఏఈతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సాధారణంగా మ్యాచ్ జరిగినప్పుడు, దానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు మీడియాతో మాట్లాడతారు. కానీ పాకిస్తాన్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రెస్ మీట్కు నిరాకరించింది. మీడియా కథనాల ప్రకారం, పాకిస్తాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోయినా, జట్టు ఆటగాళ్లందరూ మైదానంలో ప్రాక్టీస్ చేశారు.
దుబాయ్లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ బిగ్ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. గెలిచిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు జట్టు ఆటగాళ్లెవరూ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ఈ విషయం పాకిస్తాన్ను బాగా బాధపెట్టింది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో టీమిండియా కెప్టెన్తో హ్యాండ్ షేక్ చేయవద్దని చెప్పాడని పీసీబీ భావించింది. అంతేకాకుండా, ఇద్దరు కెప్టెన్లను టీమ్షీట్ మార్చకుండా ఆపారని ఆరోపణలు వచ్చాయి. అందుకే తమ మాట వినకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ బెదిరించింది.
పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్ నుంచి టీమిండియా ఇప్పటికే సూపర్ 4కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం ఇప్పుడు యూఏఈ, పాకిస్తాన్ మధ్య పోటీ ఉంది. ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. బుధవారం ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా సూపర్ 4కు అర్హత సాధిస్తుంది. ఇప్పటివరకు గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్, యూఏఈ జట్లు చెరో 2 మ్యాచ్లు ఆడాయి. అందులో చెరో ఒకటి గెలిచాయి. ఇప్పుడు సూపర్ ఫోర్లో భారత్తో ఆడాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఇక్కడ ఓడిన జట్టు టోర్నీ నుంచి అవుట్ అవుతుంది.