
భారత అభిమానులు ఏదైతే కావొద్దని వేడుకుంటున్నారో అదే జరిగేలా ఉంది. రెండు మూడు రోజులుగా బుమ్రా ఐపీఎల్ లో ఆడేది అనుమానమే అని వార్తలు వస్తుండగా తాజాగా అతడికి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో మెడికల్ సిబ్బంది తీసిన స్కాన్ లో మరింత ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. ఐపీఎల్ తో పాటు బుమ్రా ఈ ఏడాది జూన్ లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (భారత్ క్వాలిఫై అయ్యే రేసులో ముందుంది) ఫైనల్ కు కూడా అతడు అందుబాటులో ఉండేది నూటికి నూరుశాతం అనుమానంగానే ఉందని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి.
ఈఎస్పీఎన్ లో వచ్చిన కథనం మేరకు.. బుమ్రాకు అత్యవసరంగా స్కాన్స్ తీయించిన బీసీసీఐ అందులో వచ్చిన రిజల్ట్స్ తో ఆందోళనకు గురవుతున్నదని సమాచారం. వెన్నునొప్పి గాయంతో గతేడాది ఆసియా కప్ నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రాకు సర్జరీ తప్పదని తెలుస్తున్నది.
వెన్ను కిందిభాగంలో తరుచూ నొప్పి వస్తుండటంతో అతడికి సర్జరీ అత్యవసరమని ఎన్సీఏ మెడికల్ సిబ్బంది బీసీసీఐకి తెలియజేశారట. దీంతో బుమ్రా.. ఐపీఎల్ 2023 తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా మిస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7న ఓవల్ వేదికగా జరుగనుంది.
కాగా బుమ్రా గనక సర్జరీకి వెళ్తే కనీసం మూడ నుంచి నాలుగు నెలల పాటు విరామం తీసుకోవాల్సిందే. ఇక భారత జట్టుకు మొదటికే మోసం వచ్చే ప్రమాదం మరొకటి ఉంది. బుమ్రా గనక సర్జరీ చేసుకోకుంటే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉండటంతో అతడు అక్టోబర్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు జరగరానిది జరిగితే అది మొదటికే మోసం వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ.. బుమ్రాను సర్జరీ చేసుకోవాలని సూచిస్తుందని తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇన్సైడ్స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ‘బుమ్రా పరిస్థితిలో మార్పేమీ కనిపించడం లేదు. ఇప్పటికే అతడికి సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. సర్జరీ ముగిసి అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు నుంచి ఐదు నెలల సమయం అయినా పట్టే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ నాటికి అతడు ఫిట్ గా ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది. బుమ్రా విషయంలో సర్జరీ తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు..’అని చెప్పాడు.