
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ శుక్రవారం నాటింగ్హామ్లో ఇంగ్లండ్తో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్కి ముందు కోవిడ్ -19 పాజిటివ్ గా తేలాడు. దీంతో ఈ మ్యాచ్ లో అతను ఆడడంలేదు. విలియమ్సన్ పగటిపూట చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో అతనికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)ని చేశారు. ఈ పరీక్షలో పాజిటివ్ తేలింది. దీంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. కేన్ విలియమ్సన్ ఐదు రోజుల ఐసోలేషన్ను ప్రారంభిస్తాడని కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. కేన్ విలియమ్సన్ కు పాజిటివ్ నేపత్యంలో న్యూజిలాండ్ జట్టులోని మిగిలిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించారు. కాగా అందరికీ నెగిటివ్గా వచ్చాయి.
తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓడి మూడు టెస్టుల సిరీస్ను లైవ్లీగా ఉంచుకోవాలని తహతహలాడుతున్న న్యూజిలాండ్కు బ్యాటింగ్లో మెయిన్ స్టే అయిన విలియమ్సన్ ఇలా దూరం కావడం పెద్ద దెబ్బ. విలియమ్సన్ స్థానంలో స్టెడ్ ధృవీకరించిన ఓపెనర్ టామ్ లాథమ్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. ఇక, విలియమ్సన్ స్థానంలో హమీష్ రూథర్ఫోర్డ్ను జట్టులోకి పిలిచారు. "ఇంత ముఖ్యమైన మ్యాచ్ సందర్భంగా కేన్ వైదొలగవలసి రావడం చాలా బాధాకరం" అని స్టెడ్ అన్నాడు.
"ఈ సమయంలో మనమందరం అతని గురించి ఇలా అనుకుంటున్నాం. అయితే, అతనికి ఇది ఎంత నిరాశకు గురి చేస్తుందో కూడా మనం ఊహించగలం’’ అని స్టెడ్ చెప్పుకొచ్చాడు. ఏడేళ్ల క్రితం చివరిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడిన రూథర్ఫోర్డ్ ఇప్పటికే ఇంగ్లండ్లో లీసెస్టర్షైర్ ఫాక్స్ తరఫున ట్వంటీ-20 క్రికెట్ ఆడుతున్నాడు.
కాగా, మే నెలలో సుమారు ఐదు నెలల తర్వాత తిరిగి తన జాతీయ జట్టుతో కలవనున్న విలియమ్సన్.. ఇంగ్లాండ్ తో జూన్ 2 నుంచి ఇంగ్లీష్ గడ్డ మీద జరుగబోయే మూడు మ్యాచులు టెస్టు సిరీస్ కు అందుబాటులో రానున్నాడని మే 4న ప్రకటించారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. కేన్ విలిమయ్సన్ తో కూడిన 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ల హోదాలో కివీస్ జట్టు ఇంగ్లాండ్ ను ఢీకొట్టుంది.
న్యూజిలాండ్ ప్రకటించిన జట్టులో విలియమ్సన్ తో పాటు దేశవాళీ టోర్నీలలో అదరగొడుతున్న మైఖేల్ బ్రేస్వెల్, వికెట్ కీపర్ క్యామ్ ఫ్లెచర్, ఓపెనర్ హమీష్ రూథర్ఫోర్డ్, పేసర్లు జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్ కు జట్టులో చోటు దక్కింది. భారత్ తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత గాయంతో కేన్ మామ స్వదేశంలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ లలో ఆడలేకపోయాడు. ఈ రెండింటిలో న్యూజిలాండ్.. సిరీస్ లను సమం చేసింది. అయితే మోచేతి గాయం కావడం.. రాబోయే రోజుల్లో కీలక సిరీస్ ల నేపథ్యంలో విలియమ్సన్ నాలుగు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడని, అతడు ఇప్పుడు ఫిట్ గా ఉండటంతోనే తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేశామని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు.