
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ని ఓటమితో ప్రారంభించింది టీమిండియా. కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్, పరాజయంతో సిరీస్ని ఆరంభించగా వరుసగా 12 టీ20 మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, మరో మ్యాచ్లో గెలిచి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలనే ఆలోచనకి సఫారీ జట్టు బ్రేకులు వేసింది...
టీమిండియా విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కలిసి ఆడుతూ పాడుతూ ఊదేశారు. నాలుగో వికెట్కి 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ సౌతాఫ్రికాకి ఘన విజయాన్ని అందించారు. టీ20ల్లో 200లకు పైగా పరుగులు చేసిన మ్యాచ్లో పరాజయం పాలవ్వడం టీమిండియాకి ఇదే తొలిసారి.
212 పరుగుల భారీ లక్ష్యఛేదనను దూకుడుగా ఆరంభించింది సౌతాఫ్రికా. మొదటి ఓవర్లో 7 పరుగులు మాత్రమే రాగా రెండో ఓవర్లో ఆవేశ్ ఖాన్ 15 పరుగులు సమర్పించాడు. అయితే 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన సఫారీ కెప్టెన్ తెంబ భవుమాని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...
అయితే యజ్వేంద్ర చాహాల్ వేసిన నాలుగో ఓవర్లో 16, హార్ధిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో 18 పరుగులు రావడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది సౌతాఫ్రికా. 13 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేసిన ప్రిటోరియస్ను హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు...
18 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ కావడంతో 9 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులకు చేరుకుంది సౌతాఫ్రికా. అయితే డేవిడ్ మిల్లర్, వాన్ దేర్ దుస్సేన్ కలిసి ఇన్నింగ్స్ని నిర్మించారు.
అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్లో 4, 6, 6 బాది 19 పరుగులు రాబట్టిన డేవిడ్ మిల్లర్, మ్యాచ్ని ఆసక్తికరంగా మార్చేశాడు. భువీ వేసిన 15వ ఓవర్లో 4, 6,2,1 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు...
సౌతాఫ్రికా విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 56 పరుగులు కావాల్సిన దశలో హర్షల్పటేల్ వేసిన 17వ ఓవర్లో 6, 6, 4, 6 బాది 22 పరుగులు రాబట్టాడు రస్సీ వాన్ దేర్ దుస్సేన్. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా సఫారీ బ్యాటర్ల చేతుల్లోకి వెళ్లింది. డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేయగా రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
18 బంతుల్లో 34 పరుగులు కావాల్సిన దశలో భువీ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు రావడంతో మొత్తంగా 22 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ 8 పరుగులు మాత్రమే ఇచ్చినా ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయానికి 4 పరుగులు మాత్రమే కావాల్సి రావడంతో అప్పటికే మ్యాచ్ టీమిండియా చేతుల్లో చేజారింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది... ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కలిసి తొలి వికెట్కి 57 పరుగుల భాగస్వామ్యం జోడించి, శుభారంభం అందించారు. 15 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ని వేన్ పార్నెల్ అవుట్ చేశాడు... ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్కి 80 పరుగులు జోడించారు.
48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, టీ20ల్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్... కేశవ్ మహారాజ్ వేసిన 13వ ఓవర్లో వరుసగా 6,6, 4, 4 బాది 20 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఇషాన్ కిషన్...
ఆ తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, మొదటి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాను ఎదుర్కొన్న మొదటి 10 బంతుల్లో 20 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత 17 బంతుల్లో 16 పరుగులు చేయగలిగాడు...
శ్రీలంకతో జరిగిన గత మూడు టీ20 మ్యాచుల్లో 57, 74, 73 పరుగులు చేసి అజేయంగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, 27 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి ప్రిటోరియస్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
టీ20ల్లో మ్యాచ్లతో సంబంధం లేకుండా అవుట్ అవ్వడానికి ముందు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఆరోన్ ఫించ్ రికార్డును సమం చేశాడు శ్రేయాస్ అయ్యర్. కెప్టెన్ రిషబ్ పంత్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి ఆన్రీచ్ నోకియా బౌలింగ్లో వాన్ దేర్ దుస్సేన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
మూడేళ్ల తర్వాత టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, ఆఖరి నాలుగు బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చి 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.